Begin typing your search above and press return to search.

ఒక్క ఆర్డ‌ర్‌..జ‌గ‌న్ ఇమేజ్‌ ను అమాంతం పెంచేసింది

By:  Tupaki Desk   |   20 April 2020 1:00 PM GMT
ఒక్క ఆర్డ‌ర్‌..జ‌గ‌న్ ఇమేజ్‌ ను అమాంతం పెంచేసింది
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి కీల‌క‌మైన స‌మ‌యంలో వ్య‌వ‌హరించిన తీరు ఆయ‌న ఇమేజ్‌ ను ఓ రేంజ్‌ లో పెంచేసిందని అంటున్నారు. అనుకోకుండా ఇరుకున ప‌డిన జ‌గ‌న్‌... స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించిన తీరుతో అవినీతి మ‌కిలికి దూరంగా నిలిచిన నాయ‌కుడిగా మారార‌ని అంటున్నారు. ఇదంతా ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోలు వ్య‌వ‌హారం గురించి - దానిపై రేగిన దుమారం గురించి.

క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో దక్షిణ కొరియాకు చెందిన సంస్థ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాపిడ్ టెస్ట్ కిట్లు కొనుగోలు చేసింది. హైద‌రాబాద్‌ లోని సండూర్ మెడిక్ ఎయిడ్స్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా ఈ కిట్లు స‌ర‌ఫ‌రా అయ్యాయి. అయితే, ఈ కొనుగోలు విష‌యంలో భారీ స్కాం జ‌రిగింద‌ని ఆరోపణ‌లు వ‌చ్చాయి. చత్తీస్‌ గఢ్ ప్రభుత్వం దక్షిణ కొరియా దేశానికి చెందిన ఈ కంపెనీ నుంచి ఒక్కో రాపిడ్ టెస్టింగ్ కిట్‌ ను రూ.337కు కొంటే అదే సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ. 730 ధరకు రెండు లక్షల కిట్లను కొనుగోలు చేసింద‌ని, ఇందులో భారీ ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు వచ్చాయి. చత్తీస్‌ గఢ్ కంపెనీ ఎలాగూ రూ.337కు కొంటోంది కాబట్టి అదే ధరకు సండూర్ కంపెనీ ఏపీకి ఇవ్వాల్సిన త‌రుణంలో ఇంత భారీ ఎందుకు ఉంద‌నే ప్ర‌శ్న స‌హ‌జంగానే ఉత్ప‌న్నం అయింది. ఒక్క ఆర్డర్‌ పై ఎనిమిది కోట్ల ప్రజాధనం వృథా అయింద‌నే విమ‌ర్శ‌లు సైతం వ‌చ్చాయి.

ఇలా అన్ని వ‌ర్గాలు - ప్ర‌జా బాహుల్యంలో సైతం ఆరోప‌ణ‌లు - విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున జ‌రిగిన స‌మ‌యంలో...ఏపీ ముఖ్య‌మంత్రి - వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారుల‌ను ఈ త‌తంగంపై స్పందించాల‌ని స‌రైన ధ‌ర‌నే చెల్లించాల‌ని ఆర్డ‌ర్ వేశారు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ ఇన్‌ ఫ్రాస్ట్ర‌క్ష‌ర్ కార్పొరేష‌న్ స‌ద‌రు సండూర్ సంస్థ‌కు నోటీసులు ఇచ్చి ఇత‌ర రాష్ట్రాలు చెల్లించిన ధ‌ర మాత్ర‌మే తాము ఇస్తామ‌ని తేల్చిచెప్పింది. అస‌లు త‌మ‌కు ఎక్కువ ధ‌ర ఎందుకు ఇచ్చార‌ని సైతం ప్ర‌శ్నించాయి. ఈ ప‌రిణామం అనంత‌రం ఏపీ సీఎం జ‌గ‌న్‌ తో అధికారులు స‌మావేశ‌మై వివ‌ర‌ణ ఇచ్చిన స‌మ‌యంలో `మీ విద్యుక్త ధ‌ర్మాన్ని మీరు నిర్వ‌ర్తించారు. మార్కెట్ ధ‌ర ప్ర‌కార‌మే చెల్లింపులు చేస్తామ‌ని ప్ర‌క‌టించి అవినీతికి ఆస్కారం లేకుండా చేశారు`అని కితాబు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. కాగా, ఈ నిర్ణ‌యంతో ఇటు అవినీతి జ‌రిగింద‌నే ప్ర‌చారానికి చెక్ పెట్ట‌డ‌మే కాకుండా...అధికారుల‌కు సైతం త‌మ విధుల విష‌యంలో విశ్వాసం క‌ల్పింంచార‌ని అంటున్నారు.