Begin typing your search above and press return to search.

బెజవాడకు ఛానెళ్లు కూడా వెళ్లిపోతాయా?

By:  Tupaki Desk   |   19 Oct 2016 8:00 AM GMT
బెజవాడకు ఛానెళ్లు కూడా వెళ్లిపోతాయా?
X
ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ప్రజల మీద ప్రభావం చూపించే మీడియా మాధ్యమాల్లో టీవీ కీలకమన్న విషయాన్ని మర్చిపోకూడదు. సోషల్ మీడియా దుమ్ము రేపుతున్నా.. దానికంటూ పరిధి.. పరిమితులు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ.. టీవీ ఛానళ్లకు అలా కాదు. కొత్తగా వచ్చేసిన స్మార్ట్ ఫోన్లు.. 4జీ నెట్ వర్క్ పుణ్యమా అని.. ఎక్కడున్నా అరచేతి అద్భుతంగా టీవీ కార్యక్రమాలు చూసే పరిస్థితి. ఇలాంటి వేళ.. ముఖ్యమైన టీవీ ఛానళ్లు మొత్తం హైదరాబాద్ లోనే ఉండిపోవటంతో.. ఛానళ్ల చర్చల్లో ఏపీకి సరైన ప్రాధాన్యత.. ప్రాథ‌మ్యాలు దక్కటం లేదన్న కినుకు ఏపీ అధికారపక్షంలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ.. మంత్రివర్గంలోని నేతలతో జరిపిన సమావేశంలో హైదరాబాద్ లో ఉన్న టీవీ ఛానళ్లపై ఆసక్తికర చర్చ నడిచినట్లుగా తెలుస్తోంది. టీవీ ఛానళ్లు మొత్తం హైదరాబాద్ లోనే ఉండిపోయాయని.. దీంతో.. సదరు ఛానళ్లు నిర్వహించే టీవీ ఛానళ్ల చర్చల్లో ఏపీ నేతలు పాల్గొనలేకపోతున్న విషయాన్ని పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీవీ చర్చల్లో పార్టీ సీనియర్ నేతలు పాల్గొనాలన్న విషయంతో పాటు.. ప్రధాన టీవీ ఛానళ్లు మొత్తం విజయవాడలో తమ స్టూడియోలు ఏర్పాటు చేసుకోవాలన్న అంశాన్ని ఆయా యాజమాన్యాల దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లాలన్న అభ్యర్థనను చేసినట్లుగా తెలుస్తోంది.

బుచ్చయ్య చౌదరి చెప్పిన మాటలను సమావేశంలో పాల్గొన్న నేతలు పలువురు బలపర్చినట్లుగా చెబుతున్నారు. ఛానళ్లను బెజవాడకు ఆహ్వానించాలన్న నేతల మాటపై ముఖ్యమంత్రి సీరియస్ గా దృష్టి పెడితే మాత్రం.. త్వరలోనే అన్ని టీవీ ఛానళ్లు బెజవాడలోనో.. అమరావతిలోనో తమ స్టూడియోలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరీ.. ఈ పని ఏ ఛానల్ తో షురూ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/