Begin typing your search above and press return to search.

బర్తరఫ్‌ డిమాండ్‌ హాస్యాస్పదం!

By:  Tupaki Desk   |   9 Jun 2015 5:30 PM GMT
బర్తరఫ్‌ డిమాండ్‌ హాస్యాస్పదం!
X
ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదాన్ని తెరపైకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలనే డిమాండ్‌ను కేంద్రం ముందు ఉంచాలని భావిస్తోంది. ఈ మేరకు బుధవారం ఏపీ కేబినెట్‌లో కూడా తీర్మానం చేయాలని నిర్ణయించింది. అయితే, తెలంగాణ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలన్న ఏపీ ప్రభుత్వ డిమాండ్‌ హాస్యాస్పదమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి.. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చి ఏడాది మాత్రమే అయింది. కేసీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నా.. సెంటిమెంటు మాత్రం ఇంకా రగులుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి చేసే ఏ ప్రయత్నం అయినా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీయడం ఖాయమని విశ్లేషకులు వివరిస్తున్నారు. దీనికితోడు, తెలంగాణలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు బలం లేకపోయినా టీడీపీ అభ్యర్థిని నిలబెట్టిందని, అధికార పార్టీ అభ్యర్థులనే కొనుగోలు చేయడానికి దుస్సాహసం చేసిందనే విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదాన్ని కూడా తెరపైకి తెచ్చింది. ఇప్పుడు దీనిని అడ్డు పెట్టుకుని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తే.. కేంద్రం అంగీకరించదు. సరికదా, తెలంగాణ ప్రజల్లోనూ వ్యతిరేకత వస్తుందని చెబుతున్నారు. ఈ డిమాండ్‌ చేయడం ద్వారా అటు కేంద్రంలోనూ ఇటు తెలంగాణలోనూ మరోసారి పరువు పోగొట్టుకోవడం తప్ప ఉపయోగం ఉండదని వివరిస్తున్నారు.

వాస్తవానికి, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌లో శాంతి భద్రతలు గవర్నర్‌ చేతిలో ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో తొలుత ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై పెద్దగా పట్టుబట్టలేదు. తాజాగా ఫోన్‌ ట్యాపింగ్‌, స్టింగ్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులపై తెలంగాణ అధికారాన్ని తీసేయాలని, గవర్నర్‌కే అధికారాలు ఇవ్వాలని ఏపీలోని పార్టీలన్నీ ముక్తకంఠంతో కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. చంద్రబాబు కూడా పూర్తిస్థాయిలో ఈ అంశంపైనే దృష్టిసారించాలని వివరిస్తున్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలను పదేళ్లపాటు గవర్నర్‌ చేతికి వచ్చేలా చేస్తే రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా టీడీపీకి తిరుగు ఉండదని, ఇక్కడి సీమాంధ్రులంతా టీడీపీకే జై కొడతారని కూడా విశ్లేషకులు వివరిస్తున్నారు. అన్నిటికీ మించి, రేవంత్‌ వ్యవహారంపై పైచేయి సాధించిన కేసీఆర్‌పై పైచేయి సాధించినట్లు అవుతుందని కూడా వివరిస్తున్నారు.