Begin typing your search above and press return to search.

ఏపీ కేబినెట్ మార్పులు ఇలాగే ఉంటాయా?

By:  Tupaki Desk   |   27 July 2015 3:52 AM GMT
ఏపీ కేబినెట్ మార్పులు ఇలాగే ఉంటాయా?
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారా? ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంద‌రు మంత్రులు విఫలమవుతున్నారని బాబు భావిస్తున్నారా? గోదావరి పుష్కరాలు పూర్తయిన నేప‌థ్యంలో త‌న టీంను సెట్ రైట్ చేసుకునే క్ర‌మంలో ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీలో సీనియర్లకు అవకాశం ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ఉన్నం అమాత్యుల్లో ఒకరిద్దని తప్పించేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయ్యారనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ఏ సమస్య వచ్చినా తానొక్కిడినే అన్నట్లు భారం పడుతున్న నేపథ్యంలో కేబినెట్ మార్పుకు చంద్రబాబు రెడీ అయ్యారని స‌మాచారం.

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కేబినెట్ ది. అయితే సామాజిక వర్గాల ప్రకారం సమతుల్యత పాటించి చంద్రబాబు తన కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వ ప్రాధాన్యతల విషయంలో తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేబినెట్ ను రీ ఆర్గనైజ్ చేయాలని బాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రుల పని తీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకున్న చంద్రబాబు కొందరిపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకరిద్దరు మంత్రులు తమ శాఖల నిర్వహణపై పట్టు సాధించలేకపోయారని బాబు భావిస్తున్నారు.

ఎన్నికల సమయంలో టీడీపీకి పట్టం కట్టిన గోదావరి జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా చినరాజప్పకు అవకాశం కల్పించారు. సామాజికవర్గం కోణంలో పీతల సుజాత కూడా గోదావరి జిల్లాల నుండి మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఈ ఇద్దరు మంత్రులు తమ శాఖ నిర్వహణపై పట్టు సాధించలేకపోయారని చంద్రబాబు భావిస్తున్నట్లు స‌మాచారం. అదే సమయంలో అనంతపురం జిల్లా నుండి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పల్లె రఘునాథరెడ్డిపై కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

స‌మ‌చార పౌర‌సంబంధాల శాఖను సమవర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారంటూ కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నేరుగానే మంత్రిని ప్రశ్నించారని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

సింగిల్ హ్యాండ్‌తో ప్ర‌భుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్న స‌మ‌యంలో ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో మంత్రివర్గంలో చేయబోయే మార్పుల్లో సీనియర్లకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఇప్పటికే ఎమ్మెల్సీలుగా పయ్యావుల కేశవ్, గాలి ముద్దు కృష్ణమ నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు అవకాశం కల్పించటానికి కారణం కూడా అదేనంటున్నాయి ట్రస్టు భవన్ వర్గాలు. గాలి ముద్దు కృష్ణమ నాయుడుకి మంత్రి పదవి కల్పించలేకపోతే మండలిలో చీఫ్ విప్ పదవి ఇవ్వటం ద్వారా కేబినెట్ హోదా కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారట. మరోవైపు అనంతపురం నుండి పయ్యావులకు అవకాశం కల్పిస్తే పల్లె రఘునాథరెడ్డిని మంత్రి పదవి నుండి తప్పించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పీతల సుజాతకు కూడా పదవి గండం తప్పేటట్లు కన్పించటం లేదు. ఉపముఖ్యమంత్రి హోదాను కూడా చిన్నరాజప్ప నుండి గంటా శ్రీనివాసరావుకు కల్పించే అవకాశాలున్నాయి. గతంలో ఐ అండ్ పీఆర్‌ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరోసారి ఆ బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారట.

ఒక వైపున పార్టీని మరోవైపు ప్రభుత్వాన్ని తన విజన్ తో ముందుకు తీసుకెళ్ళాలంటే సీనియర్ల సహకారం తప్పనిసరి అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని అందుకే మార్పులు ఉంటాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు భావిస్తున్నాయి.