Begin typing your search above and press return to search.

ఏపీ క్యాబినెట్ ఎన్ని నిర్ణయాలు తీసుకుందంటే..

By:  Tupaki Desk   |   23 Sep 2016 5:56 AM GMT
ఏపీ క్యాబినెట్ ఎన్ని నిర్ణయాలు తీసుకుందంటే..
X
మంత్రివర్గ సమావేశాల్ని నిర్వహించటం ముఖ్యమంత్రులకు మామూలే. క్యాబినెట్ మీటింగ్ ల విషయంలో ఒక్కో సీఎం తీరు ఒక్కోలా ఉంటుంది. కొంతమంది సీఎంలు తరచూ మంత్రివర్గ సమావేశాల్ని ఏర్పాటుచేయటం.. రాజకీయ అంశాల్ని ప్రస్తావించి.. చర్చించటం కనిపిస్తుంది. మరికొంతమంది ముఖ్యమంత్రి పాలనా పరమైన అంశాల్ని చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇంకొంతమంది ముఖ్యమంత్రులు.. ప్రతి విషయాన్ని చర్చించినట్లుగా క్యాబినెట్ ముద్ర వేయటం కనిపిస్తుంది. గురువారం ఏపీ ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాల్ని చర్చించి తీసుకున్న నిర్ణయాల్లో అందరి దృష్టిని ఇట్టే ఆకర్షించే అంశం ఒకటి ఉంది. అదేమంటే.. సీసీ కెమేరాలు.. డ్రోన్లు.. ఇతర సాఫ్ట్ వేర్.. హార్డ్ వేర్ కు సంబంధించిన వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం. ఇలాంటి మరికొన్ని నిర్ణయాలతో పాటు.. ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర పడిన అంశాల్ని చూస్తే..

= అమరావతి.. విశాఖపట్నం.. తిరుపతి.. రాజమండ్రిలలో నగర పర్యాటక మండళ్ల ఏర్పాటు. ఏడాదికి ఏకరాకు రూ.5కోట్ల చొప్పున లీజు విలువ కానీ.. 2.5 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి కానీ ఏది తక్కువ ఉంటే దాన్ని పర్యాటక ప్రాజెక్టులకు కేటాయించే అధికారాన్ని పర్యాటక మండళ్లకు అప్పగిస్తూ నిర్ణయం.

= విశాఖ ఎయిర్ పోర్ట్ రన్ వే ని విస్తరించి అభివృద్ధి చేయాలన్న నిర్ణయం. ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా.. భారత ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోవటానికి ఆమోదముద్ర.

= ఉద్యోగులు వారి ఇళ్ల నుంచి నడిచి వెళ్లేంత దూరంలో పారిశ్రామిక కారిడార్ ల ఏర్పాటు చేసేలా ఆర్థిక నగరాల ఏర్పాటు.

= సీసీ కెమేరాలు.. డ్రోన్లు.. ఇతర సాఫ్ట్ వేర్.. హార్డ్ వేర్ పరికరాల కొనుగోలుకు ఒక కంపెనీ ఏర్పాటు

= గోల్ఫ్ టూరిజనాన్ని ప్రోత్సహించేందుకు విశాఖలోని ముడసరి లోవాలో 12.72 ఎకరాల ఈస్ట్ పాయింట్ కేటాయింపు

= దేవాదాయకు చెందిన భూమిని విశాఖ జిల్లా అడవి రామవరంలో ప్రభుత్వ.. ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు డెవలపర్ గా ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ.. నోవా ఎడ్యుకేషనల్ సొసైటీలతో కూడిన కన్సార్టియంల ఎంపిక.

= బీసీ కమిషన్ సూచన నేపథ్యంలో బీసీ డీ జాబితాలో ‘‘సాతాని’’ మాటను తొలగించి ‘‘చాత్తాడ శ్రీవైష్ణవ’’ అనే పదాన్ని చేర్చాలన్న నిర్ణయం.

= పురపాలిక శాఖలో జేఎన్ ఎన్ యూఆర్ ఎం పథకం అమల్లో వివిధ పనులు చేపట్టిన వీఎంసీ అధికారులు జీవో నెంబర్ 94.. 504లను ఉల్లంఘించినట్లుగా ఉన్న ఆరోపణలపై తదుపరి చర్యలు చేపట్టకుండా నిలిపివేత.

= ఫెర్రో అల్లాయిస్ ఉత్పత్తిదారుల సంఘం అభ్యర్థన మేరకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ.. మినహాయింపు.. వాయిదాల్లో చెల్లింపులకు షరతులతోకూడిన అనుమతి.

= జిల్లాకు ఒక బీసీ భవన్ నిర్మాణం.

= బీసీ విద్యార్థులకు విదేశీ చదువులకు అవకాశం కల్పించాలన్న నిర్ణయానికి ఆమోదం.

= నగర పంచాయితీలు.. మున్సిపాలిటీ.. నగరపాలక సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు అంగీకారం.

= చెరుకు బకాయిల విడుదలకు సహకరా చక్కెర కర్మాగారాలకు రూ.35.76 కోట్ల క్రెడిట్ ఆథరైజేషన్ ఇచ్చేందుకు అనుమతి.

= శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండటంలోని తర్లిపేటలో 209.84 ఎకరాల భూమిని వేదిక్ వర్సిటీ ఏరపాటుకు శ్రీమత్ ఉభయ వేదాంతచార్య పీఠానికి 50 ఎకరాల్ని రూ.1.5లక్షల చొప్పున (ఎకరా).. మిగిలిన భూమిని ఎకరా రూ.50వేల చొప్పున కేటాయింపు. ఈ ప్రాజెక్టుకు నాలుగేళ్ల వ్యవధిలో రూ.350 కోట్లతో నిర్మించాలి.

=నెల్లూరు జిల్లా కోట మండలం కొత్త పట్నంలో 52.22 ఎకరాల భూమిని రూ.542 కోట్ల పెట్టుబడితో టయోటా నెక్కంటిమెగా ఫుడ్ పార్క్ నిర్మించే చక్కెర శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు కేటాయింపు.

= పశుసంవర్థకశాఖలో రాష్ట్ర స్థాయికమిటీ ద్వారా 300 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ.

= వచ్చే జనవరి 3 నుంచి ఐదు రోజుల పాటు తిరుపతిలో ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ నిర్వాహణకు నిర్ణయం.