Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ను మింగేయాలని చూస్తున్న బీజేపీ

By:  Tupaki Desk   |   19 Feb 2016 10:30 PM GMT
కాంగ్రెస్ ను మింగేయాలని చూస్తున్న బీజేపీ
X
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క సీటు కూడా గెలుచుకోని ఆ పార్టీలో ఇంకా కొందరు సీనియర్లు - ప్రజాదరణ ఉన్న నేతలు ఉన్నారు. ఇప్పుడు వారిపై బీజేపీ కన్నేసింది. వారిని తమ పార్టీలోకి లాగి ఫుల్లుగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోంది.

బీజేపీ చేపడుతున్న ఆపరేషన్ ఆకర్ష్‌తో ఏపి కాంగ్రెస్ నాయకత్వంలో కలవరం మొదలవుతోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఇలా వలస వచ్చిన సీనియర్ నేతల ద్వారా బిజెపి అగ్రనాయకత్వం ఏపిలో ఇంకా మిగిలి ఉన్న బలమైన కాంగ్రెస్ క్యాడర్‌ ను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం తెలుసుకొనే ఏపి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బెదురుతోంది. ఇక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేదెలా అన్న దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్‌ ను వీడి పార్టీలో చేరిన సీనియర్ నేతల రాయబారం ద్వారా మరికొంత మంది ఆ పార్టీ నేతలకు గాళంవేసే దిశగా బిజెపి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని బతికించుకొనేదెలా అన్న సంసిగ్దతతో కాంగ్రెస్ నాయకత్వం పడింది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం పాలైంది. అయినా కొంత మంది సీనియర్ నేతలు పార్టీని అంటుపెట్టుకొని ఉండటంతో కనీసం వచ్చే సార్వత్రిక ఎన్నికలోపైనా పార్టీని బలోపేతం చేసుకొని తన ఉనికిని చాటుకోవాలని ఏపి కాంగ్రెస్ నాయకత్వం భావించింది. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి నినాదంతో జనంలోకి వెళ్లాలని భావించింది. ఇంతవరకు బాగానే ఉన్నా పార్టీ సీనియర్‌నేత కన్నా లక్ష్మినారాయణ, కావూరి సాంబశివరావు తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో వారి వారి ప్రాంతాల్లో బలమైన నేతలుగా ఉన్న వారు బిజెపిలో చేరారు. ఇప్పుడు అదే నేతల సహాయంతో ఇంకా కాంగ్రెస్‌ లో మిగిలివున్న నేతలకు గాళం వేసి ఏపిలో పుంజుకోవాలని బిజెపి నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

విభజన అనంతరం పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు రుణ మాఫి విషయంలో, ఇతర అంశాలపైనా టిడిపి సర్కార్‌ పై ఏపి కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. అక్కడక్కడ పార్టీ పరంగా జరుగుతున్న కార్యక్రమాలకు తప్పా మెజార్టీ సీనియర్ నేతలు ఎవరూ ఏపి కాంగ్రెస్‌ లో చురుకైన పాత్ర పోషించడంలేదన్న విమర్శలు ఆ పార్టీలోనే వెల్లువెత్తుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపి పిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టి, కాంగ్రెస్‌ కు స్టార్ క్యాంపెయినర్‌ గా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సైతం నేడు పార్టీకి అంటి అంటనట్లు ఉన్నారు. ఇటీవల ఆయన కాపు రిజర్వేషన్లపై సిఎం చంద్రబాబుకు లేఖ రాయడం, దీక్షకు కూర్చొన్న ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు వెళ్లారు. కాపు గర్జన సమయంలో తప్పా ఇప్పటికీ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేతలంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఇష్టంలేకున్నా కొనసా గుతున్న బలమైన నేతలను కన్నా లక్ష్మినారాయణ, కావూరి సాంబశివరావు, పురందేశ్వరీ, కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరుల ద్వారా బిజెపిలోకి వచ్చేలా రాయభారం కొనసాగుతోంని తెలుస్తోంది.