Begin typing your search above and press return to search.

ఏపీపై బీజేపీ ఫోక‌స్ ఎందుకు మారింది?

By:  Tupaki Desk   |   16 Sep 2017 4:59 PM GMT
ఏపీపై బీజేపీ ఫోక‌స్ ఎందుకు మారింది?
X
ద‌క్షిణాదిపై దృష్టిపెట్టిన భార‌తీయ జ‌న‌తాపార్టీ తెలుగు రాష్ర్టాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌ప‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తెలంగాణ‌లో టీఆర్ ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన రోడ్ మ్యాప్‌ తో ముందుకు సాగుతున్న బీజేపీ అక్క‌డ త‌న వ్యూహం మార్చుకోనప్ప‌టికీ...ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విష‌యంలో త‌న స్టాండ్ మార్చుకుంది. రాష్ట్రంలో పదిహేను పార్లమెంటు స్థానాలే లక్ష్యంగా మూడున్నరేళ్లుగా పార్టీ నిర్మాణంపై దృష్టిసారించిన బీజేపీ ఉన్నట్టండి వ్యూహం మార్చుకుంది. శాసనసభ నియోజకవర్గాలపై దృష్టి సారించిన‌ట్లు ఆ పార్టీ ముఖ్య‌నేత‌లే స్ప‌ష్టంగా చెప్తున్నారు. రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లోను బలం పెంచడంపై దృష్టి సారించామంటూ ఆ పార్టీ నేతలు తేల్చిచెప్తున్నారు. అయితే ఇలా ప్లాన్ మార్చ‌డం వెనుకున్న వ్యూహమేమిటనేది ఇప్పడు రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ.

ఒంగోలులో జ‌రిగిన బీజేపీ రాష్ట్ర ప‌దాదికారుల స‌మావేశం అనంత‌రం పార్టీ నేత‌లంతా ఇదే మాట చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ధీటుగా బీజేపీని తీర్చిదిద్దాల‌నే భావ‌న‌ను బ‌లంగా వినిపించే ఎమ్మెల్సీ - బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు ఈ కామెంట్లు చేయ‌డంలో ముందున్నారు. రాష్ట్రంలో 115 నియోజకవర్గాల్లో బలం పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వీర్రాజు తెలిపారు. అధికార తెలుగుదేశం పార్టీకి తాము మిత్రపక్షమే అయినప్పటికీ తమ బలం పెంచుకునేందుకు సొంతంగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పైగా తాము మిత్రపక్షంగా ఉన్నప్పడు 115 స్థానాలు గెలుస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా ప్రకటిస్తారంటూ ఆయన ప్రశ్నించారు. అత్యంత ఆస‌క్తిక‌రంగా ఇదే విషయాన్ని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా నిలదీశారు.

టీడీపీ నేత‌లు చెప్తున్న‌ట్లుగా 175స్థానాల్లో సొంతంగా గెలుస్తారా? లేదా మిత్రపక్షంతో కలిసి విజయం సాధిస్తారా అనేది టీడీపీ నేత‌లే స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని విష్ణుకుమార్ రాజు ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ఏ విధంగా అయితే బలపడాలని అనుకుంటుందో.. బీజేపీ కూడా ఆ విధంగానే బలపడాలని అనుకుంటుందని అన్నారు. రాష్ట్రంలోనూ తమ బలం పెంచుకుంటామని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

అయితే పార్టీ నేత‌ల్లో స‌డెన్‌గా ఈ స్వ‌రం మార‌డం అర్థ‌మేంటి? జాతీయ నేత‌లు ఏమైనా ప్ర‌త్యేక సూచ‌న‌లు చేశారా? లేక‌పోతే త‌మ సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నారా? అనేది ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌ అయింది.