Begin typing your search above and press return to search.

జేఎన్‌టీయూలో అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   24 Jun 2015 10:13 AM GMT
జేఎన్‌టీయూలో అసలేం జరిగింది?
X
కూకట్‌ పల్లి జేఎన్టీయూలో ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మీద దాడి జరిగిందన్న వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. ఓ పక్క తెలంగాణలో ఎలాంటి దాడులు జరగటం లేదని తెలంగాణ అధికారపక్షం చెబుతున్న సమయంలోనే ఇలాంటి ఘటన జరగటమే కాదు.. దీనిపై బాధితుడు గవర్నర్‌ ను కలిసి ఫిర్యాదు చేయటం.. ఈ ఘటనపై ఆయన సీరియస్‌ అయ్యారన్న మాట వినిపిస్తోంది.

ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మీద దాడి ఎందుకు జరిగింది? అసలు అక్కడ ఏం జరిగిందన్న అంశంపై అక్కడి వారి మాటలు.. రాజశేఖర్‌ ఫిర్యాదును పరిశీలిస్తే..- కూకట్‌పల్లి ప్రగతినగర్‌కు చెందిన రాజశేఖర్‌ కొండాపూర్‌ న్యాక్‌ లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం ఆయన జేఎన్టీయూలో తన స్నేహితులను కలిసేందుకు క్యాంపస్‌కు వెళ్లారు. సెక్షన్‌ 8 అమలు అంశంపై జేఎన్టీయూ విద్యార్థులు ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబమ్మను వర్సిటీ ద్వారానికి వేలాదీయాటన్ని రాజశేఖర్‌ గుర్తించారు.

- చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా చేస్తుంటే ఏం చేస్తున్నావంటూ అక్కడి వాచ్‌ మన్‌కి క్లాస్‌ తీసుకున్నారు. నేను చెబితే వింటారా?

మీరే చెప్పండనటంతో విద్యార్థులకు చెప్పే ప్రయత్నం చేశారు.

- ఇలా దిష్టిబమ్మ కట్టటానికి వర్సిటీ అధికారులు మీకు పర్మిషన్‌ ఇచ్చారా అని ప్రశ్నించారు. దీనికి అక్కడి విద్యార్థులు.. మాకు చెప్పటానికి నువ్వెవరు అని ప్రశ్నించటం.. వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంలో ఉద్రిక్తత పెరిగి రాజశేఖర్‌పై విద్యార్థులు దాడి చేశారు.

- ఆంధ్రాకు చెందిన నువ్వు మళ్లీ ఇక్కడ కనిపించొద్దు అంటూ విద్యార్థులు అన్నారంటూ రాజశేఖర్‌ ఆరోపిస్తున్నారు. దీనిపై గవర్నర్‌ను కలిసి తన మీద జరిగిన దాడి ఘటనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

- మరోవైపు ఈ ఘటనపై కేపీహెచ్‌ పోలీసులు స్పందించి.. రాజశేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మరోవైపు.. జేఎన్టీయూ విద్యార్థుల దాడికి నిరసనగా.. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నేషనల్‌ హైవే మీద విద్యార్థులు ఆందోళన చేపట్టారు.