Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ అనంత్ బాబు కు షాక్.. బెయిల్ పిటిషన్ రద్దు చేసిన కోర్టు

By:  Tupaki Desk   |   18 Jun 2022 6:30 AM GMT
ఎమ్మెల్సీ అనంత్ బాబు కు షాక్.. బెయిల్ పిటిషన్ రద్దు చేసిన కోర్టు
X
దళిత యువకుడు, తన మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనంత బాబుకు కోర్టు షాకిచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని అనంత్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కోర్టు రద్దు చేసింది. తాజాగా జరిగిన విచారణలో ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి అనంత్ బాబు పిటిషన్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

బెయిల్ పొందడానికి సరైన కారణాలను చూపడంలో అనంత్ బాబు న్యాయవాది విఫలమయ్యారని.. అందుకే అతడి పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు. కేసులో విచారణ పూర్తి కాకపోవడం, అనంత్ బాబు బయటకొస్తే సాక్షులు ప్రభావితం చేసే అవకాశముందన్న బాధితుల తరఫు న్యాయవాది వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.

మరోవైపు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. అనంత్ బాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని కోరారు. అంతేకాకుండా అతడిపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ కు విన్నవించారు.

ఈ మేరకు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, సోదరుడు, భార్యతోపాటు విశాఖపట్నం జిల్లా దళిత సంఘాలు ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలసి వినతిపత్రం అందించారు. అనంత్ బాబుకు బెయిల్ ఇచ్చి.. ఎమ్మెల్సీగా కొనసాగిస్తే తమ కుటుంబాన్ని మొత్తం అంతం చేస్తాడని బాధితులు గవర్నర్ వద్ద గోడు వెల్లబోసుకున్నట్టు సమాచారం.

సుబ్రహ్మణ్యం హత్యపై ఆందోళనలు చేస్తే నాలుగు రోజులు తర్వాత పోలీసులు కేసులు పెట్టారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ అనంత్ బాబు కావాలని హత్య చేయలేదని.. క్షణికావేశంలో జరిగిందని పోలీసులు చెప్పడాన్ని గవర్నర్ కు వివరించారు.

అదేవిదంగా అనంత్ బాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఐపీసీ 302 కింద కేసు పెట్టకుండా కేవలం ఐపీసీ 174 కింద మాత్రమే కేసు పెట్టారని వాపోయారు. అనంత్ బాబుపై గతంలోనే రెండు కేసులు పెండింగ్ లో ఉన్నా ఆయనపై ఏ కేసులు లేవని పోలీసులు పేర్కొన్నారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఈ కేసు నుంచి ఎమ్మెల్సీని సునాయాసంగా తప్పించే కుట్ర జరుగుతుందని వివరించారు. అందువల్ల అనంత్ బాబుపై సీబీఐ విచారణ వేయాలని విజ్ఞప్తి చేశారు. సుబ్రహ్మణ్యం తమ్ముడు నవీన్ ను కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చారు.