Begin typing your search above and press return to search.

ఈ రోజు నుండి ఆనందయ్య మందు పంపిణీ... కట్టుదిట్టమైన భద్రత !

By:  Tupaki Desk   |   7 Jun 2021 7:31 AM GMT
ఈ రోజు నుండి ఆనందయ్య మందు పంపిణీ... కట్టుదిట్టమైన భద్రత !
X
గత కొన్ని రోజులుగా ఎప్పుడా ఎప్పుడా అని తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆనందయ్య మందు పంపిణీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చాయి. అయితే అందరూ ఊహించినట్టు కాకుండా.. తొలి రోజు కేవలం పరిమిత సంఖ్యలోనే మందును పంపిణీ చేయనున్నారు. కనీసం 5 వేల మందికి పంపిణీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ , ఆ సంఖ్యను మరింత కుదించారు. తొలి రోజు కేవలం 2 వేల మందికి మాత్రమే మందు పంపిణీ చేయనున్నారు. మరోవైపు చుక్కల మందు పంపిణీపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కృష్ణపట్నం, సర్వేపల్లి, చంద్రగిరి. ఇది ఆనందయ్య మందు తయారు చేసే రూటు.

కృష్ణపట్నంలో ఆనందయ్య తమ్ముడు నాగరాజు మందు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. సర్వేపల్లిలో స్వయంగా ఆనందయ్య చంద్రగిరిలో కొడుకు శ్రీధర్‌ మందు తయారు చేసి పంపిణీకి సిద్ధమయ్యారు. అలాగే , అమెరికాలో ఉన్న కుమారుడు కూడా మందు విస్తరణపై దృష్టిపెట్టినట్లు సమాచారం. మొత్తంగా ఆనందయ్య పసరు మందు లోకల్‌ టు గ్లోబల్‌ స్థాయికి విస్తరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అదే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. ఇన్ని వివాదాలు మధ్య నాటు మందు పంపిణీ అయ్యేనా , అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నవారికి మొదట మందు వేయాలని ఆనందయ్య కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఇతర ప్రాంతాల వారు ఎవరినీ రానీయడం లేదు. ప్రస్తుతం మందు కావాలి అంటే సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలి.ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఆధార్ కార్డు పరిశీలించి తరువాత గ్రామంలోకి అనుమతిస్తున్నారు పోలీసులు. వాలంటీర్ల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ.. మెడిసిన్ డోర్ డెలివరీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు శ్రీ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు శ్రీగోవిందానంద సరస్వతి నేతృత్వంలో ఆనందయ్య శనివారం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలోని శ్రీసిద్ధేశ్వరాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మహాశివుడి ముందు కరోనా మందు ఉంచి పూజలు చేయించారు. ఆనందయ్య మందు కరోనా నుంచి కాపాడుతుందని అధికారికంగా ఎవరూ నిర్ధారించలేదు. కేవలం ఆనందయ్య మందు వల్ల ఎలాంటి హాని జరగదు అని మాత్రమే నివేదిక ఉంది. అయినా చాలామంది కరోనా రాకుండా ఉండేందుకు ఆనందయ్య మందు ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. ఇతర జిల్లాల వారు కృష్ణపట్నం రావొద్దని సూచించారు. త్వరలో ఇతర జిల్లాలకు పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారు. మరోవైపు తిరుపతిలో కూడా ఆనందయ్య పంపిణీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మందు తయారీ ప్రక్రియ ప్రారంభమయింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని నారాయణ గార్డెన్స్‌లో కరోనా ఆయుర్వేద మందును తయారు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మందును పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు.

అటు, ఆనందయ్య మందుపై వివాదం ముదురుతోంది. సేశ్రిత టెక్నాలజీపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ ఎండీ నర్మదా రెడ్డి కృష్ణపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్‌ ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద సోమిరెడ్డి పై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసు నమోదు చేశారు పోలీసులు. తమ ప్రాజెక్ట్‌ పై సోమిరెడ్డి చేసినవి తప్పుడు ఆరోపణలన్నారు నర్మదారెడ్డి. వెబ్‌ సైట్ పూర్తి కాకుండానే సాఫ్ట్‌వేర్ చోరీ చేశారని ఆరోపించారు. కాకాణికి, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు నర్మదారెడ్డి. మొత్తానికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కేవలం తమ తమ నియోజకవర్గ ప్రజల కోసమే మందును తయారు చేయిస్తుండడంపైనా విమర్శలు వస్తున్నాయి. మందుకోసం ఎదురుచూస్తున్న మిగతా వారంతా ఏమైపోవాలని జనం ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే, ఆనందయ్య మందు కరోనా నుంచి కాపాడుతుందని అధికారికంగా ఎవరూ నిర్ధారించలేదు. కేవలం ఆనందయ్య మందు వల్ల ఎలాంటి హాని జరగదు అని మాత్రమే నివేదిక ఉంది. అయినా చాలామంది కరోనా రాకుండా ఉండేందుకు ఆనందయ్య మందు ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. ఈ రోజు హైకోర్టులో ఆనందయ్య చుక్కల మందుపై విచారణ జరగనుంది. తన మందుకు నేడు అనుమతి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు