Begin typing your search above and press return to search.

అగ్నివీరులకు ఆనంద్ మహీంద్ర బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   20 Jun 2022 5:18 AM GMT
అగ్నివీరులకు ఆనంద్ మహీంద్ర బంపర్ ఆఫర్
X
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై చెలరేగుతున్న ఆందోళనల మధ్య ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అగ్నివీరులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అగ్నివీరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వారి ఉద్యోగాలకు భరోసా ఇచ్చారు.

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నాలుగేళ్ల పాటు సాయుధళాల రెగ్యులర్ కేడర్ లో రిక్రూట్ అయ్యే రక్షణ దళాలైన అగ్నివీరులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొత్త రిక్రూట్ మెంట్ స్కీమ్ కు 'అగ్నిపథ్'ఫై ఆందోళనలు జరుగుతున్నాయి. నాలుగేళ్ల పాటు మాత్రమే ఆర్మీలో సేవలందించేలా రిక్రూట్ మెంట్ పై నిరుద్యోగ యువత భగ్గుమంటున్నారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని.. కెరీర్ లో అనిశ్చితి ఏర్పడుతుందని ఈ అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్టు యువకులు అంటున్నారు.

అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. ఆనంద్ మహీంద్రా 'గత సంవత్సరం ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు తాను అగ్నివీరులు పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారిని ప్రముఖంగా ఉపాధి పొందేలాచేస్తాయని చెప్పానని' పేర్కొన్నారు. అగ్నిపథ్ పై హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం తనకు బాధ కలిగించిందని అన్నారు.

ఈ క్రమంలోనే మహీంద్రా గ్రూప్ ఈ అగ్నిపథ్ ద్వారా శిక్షణ పొందిన సమర్థులైన యువకులకు రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుందని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. మహీంద్రా గ్రూప్ అగ్ని వీరులకు ఏమీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆనంద్ మహీంద్రాను ట్విట్టర్ వేదిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి స్పందించిన ఆయన క్లారిటీ ఇచ్చారు.

కార్పొరేట్ సెక్టర్ లో అగ్నివీరుల ఉపాధికి పెద్ద అవకాశం ఉందన్నారు. నాయకత్వం, టీంవర్క్, శారీరక శిక్షణతో ఉండే అగ్ని వీరులకు కంపెనీ కార్యకలాపాల నుంచి పరిపాలన , మార్కెటింగ్ చైన్ నిర్వహణ వరకూ అన్ని విభాగాలలో అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక కేంద్రం కూడా అగ్నివీరులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. రక్షణ మంత్రిత్వ శాఖలోని 10శాతం ఉద్యోగ ఖాళీలను అగ్ని వీరులకు అవసరమైన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా రిజర్వ్ చేసే ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. సీఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్ రిక్రూట్ మెంట్ లో వారికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అగ్ని వీరులకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించాయి. మొత్తంగా 'అగ్నివీరుల' ఆందోళనల నేపథ్యంలో వారికి తదనంతర భవిష్యత్ పై హామీలు వెల్లువెత్తుతున్నాయి.