Begin typing your search above and press return to search.

నెల్లూరు వైసీపీలో ‘ఆనం’దం

By:  Tupaki Desk   |   7 July 2018 5:15 AM GMT
నెల్లూరు వైసీపీలో ‘ఆనం’దం
X
చంద్రబాబు చేతిలో దారుణంగా మోసపోయిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఇప్పుడు వైసీపీ వైపు అడుగులు వేస్తుండడంతో నెల్లూరు వైసీపీలో ఉత్సాహం కనిపిస్తోంది. నెల్లూరులో ఇప్పటికే వైసీపీ బలంగా ఉన్నప్పటికీ జిల్లాలో అన్ని సీట్లూ వైసీపీ ఖాతాలో పడేలా చేయాలని అక్కడి నేతలు కోరుకుంటున్నారు. ఆనం తమ పార్టీలోకి వస్తే అది సాధ్యమవుతుందన్నది వారి ఆలోచన.

కాగా రాంనారాయణరెడ్డి తాజాగా జగన్‌ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్న వీరిద్దరూ దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. కాగా, వైసీపీలో ఆనం చేరతారన్న వార్తల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పది నిమిషాల భేటీ అయినా ఇది చాలా కీలకమని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు టీడీపీతో ఆనం దాదాపు తెగతెంపులు చేసుకున్నట్లుగానే చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణరెడ్డి - ఆయన సోదరుడు వివేకా గత ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయం తరువాత చంద్రబాబు పిలుపు - హామీలతో టీడీపీలోకి వచ్చారు. అయితే.. వారికి అక్కడ ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆనం వివేకాకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి హ్యాండిచ్చారని ఆనం బ్రదర్స్ పలుమార్లు ఆరోపించారు.

అనంతర ఆనం వివేకా ఆరోగ్యం క్షీణించి ఇటీవల మరణించారు. ఆయన మరణించడానికి కొద్దిరోజుల ముందు చంద్రబాబు పరామర్శకు వెళ్లగా.. అసలు చంద్రబాబును రావొద్దని రాంనారాయణ రెడ్డి చెప్పారని వార్తలొచ్చాయి. అయినా, ఆయన రావడంతో ఆ సమయానికి తన సోదరుడి వద్ద ఉన్న రామనారాయణ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారని.. చంద్రబాబు వెళ్లాకే ఆయన మళ్లీ ఆసుపత్రిలోకివచ్చారని ... ఆయనలో చంద్రబాబంటే అంతగా కోపం ఉందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తరువాత టీడీపీకి ఆనం రామనారాయణ రెడ్డి పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడాయన వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.