Begin typing your search above and press return to search.

పోలీసులు సెక్యురిటీగా రాగా తల్లిని కలిసిన అమృత

By:  Tupaki Desk   |   15 March 2020 4:51 AM GMT
పోలీసులు సెక్యురిటీగా రాగా తల్లిని కలిసిన అమృత
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మిర్యాలగూడ మారుతిరావు ఉదంతం గురించి తెలిసిందే. తనకు ఇష్టం లేని ప్రేమవివాహం చేసుకున్నదంటూ తన కుమార్తె పెళ్లాడిన ప్రణయ్ అనే యువకుడ్ని కిరాయి గూండాలతో చంపించిన మారుతిరావు.. వారం క్రితం ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. తన సూసైడ్ నోట్ లో భార్యను క్షమించాలని.. కుమార్తెను తల్లి దగ్గరకు వెళ్లాలని మారుతిరావు కోరారు. తండ్రి చివరి కోరిక మేరకు.. అంత్యక్రియల సమయంలో తల్లిని పరామర్శించేందుకు అమృత వెళ్లినా.. స్థానికులు అడ్డుకోవటంతో ఆమె వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటే.. శనివారం పోలీసుల సాయంతో తల్లి గిరిజను కలిసేందుకు ఇంటికి వెళ్లారు అమృత. మీడియాకు సమాచారం ఇవ్వకుండా.. కారులో వెళ్లిన ఆమె.. తల్లిని కలిసి ఆమెను పరామర్శించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా తనతో పాటు తన కుమారుడ్ని వెంట పెట్టుకొని వెళ్లారు. తల్లిని కలిసేందుకు వెళుతున్న వేళ మీడియా కంటపడకుండా వెళ్లిన అమృత.. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడలేదు. మీడియాను తన వద్దకు రాకుండా చూడాలని పోలీసుల్ని కోరినట్లుగా తెలుస్తోంది.

కొడుకును తీసుకొని వెళ్లిన అమృతను చూసిన తల్లి గిరిజ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తోంది. సుమారు పావుగంట పాటు వారు మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. తల్లిని పరామర్శించిన తర్వాత పోలీసుల సంరక్షణలోనే అత్తారింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే.. శనివారం సాయంత్రం తన తండ్రికి సంబంధించిన ఆస్తుల్ని చూసేందుకు వెళ్లినట్లుగా చెబుతున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతున్నాయి. నాగార్జుననగర్ లోని తన తండ్రి మారుతీరావుకు సంబంధించిన ప్లాట్స్ ను అమృత చూసినట్లుగా చెబుతున్నారు. వ్యక్తి బైక్ మీద వచ్చిన ఆమె.. ఆ ప్లాట్స్ ఫోటోలు తీసుకోవటంతో పాటు.. మరికొన్ని ఆస్తుల్ని పరిశీలించినట్లు చెబుతున్నారు. ఆస్తుల్ని ఫోటోలు తీసుకుంటున్న అమృతను స్థానికులు కొందరు ఫోటోలు తీశారు. తల్లిని పరామర్శించేందుకు కారులో వెళ్లిన ఆమె.. ఆస్తుల పరిశీలన సందర్భంగా మాత్రం ఒక వ్యక్తి బైక్ మీద వెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు.