Begin typing your search above and press return to search.

ఆ బ్యాంక్ కు మాజీ సీఎం సతీమణి కారణంగా భారీ షాక్

By:  Tupaki Desk   |   28 Dec 2019 4:57 AM GMT
ఆ బ్యాంక్ కు మాజీ సీఎం సతీమణి కారణంగా భారీ షాక్
X
ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. చర్యకు ప్రతిచర్య చాలా వేగంగా సాగుతోంది. గతంలో రాజకీయాలు వేరు. వ్యక్తిగత అంశాలు వేరు అన్నట్లు ఉండేవి. ఇప్పుడా గీతను చెరిపేస్తున్నారు. రాజకీయంగా తేడా కొట్టినంతనే దానికి ప్రతిచర్యను ప్రదర్శిస్తూ.. అలా చేస్తే ఇలానే ఉంటుంది మరన్న సంకేతాల్ని ఇచ్చేస్తున్నారు. రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు.. అంత మాత్రానికే మరీ ఇంతలా టార్గెట్ చేసేయటమా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అర్థం కావట్లేదా? సరే.. వివరంగా చెప్పుకొస్తాం.

మహారాష్ట్రలో శివసేన..ఎన్సీపీ.. కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా.. ఫలితాల వెల్లడి తర్వాత మిత్రుడి మొండితనంతో బయటకు వచ్చేసి అధికారాన్ని సొంతం చేసుకున్న శివసేన.. కొన్ని విషయాల్ని సీరియస్ గా తీసుకుంటున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం శివసేన ఏలుబడిలో ఉంది.

కార్పొరేషన్ ఇచ్చే జీతాల్ని ఉద్యోగులకు యాక్సిస్ బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవారు. కానీ.. రాత్రికి రాత్రి నిర్ణయం మారిపోయింది. థానే మేయర్ మాట్లాడుతూ ఉద్యోగుల జీతాల్ని యాక్సిస్ బ్యాంకు నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ప్రభుత్వ బ్యాంక్ కు మార్చనున్నట్లు చెబుతున్నారు. ఎందుకిలా? అన్న లోతుల్లోకి వెళితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. యాక్సిస్ బ్యాంకులో కీలకమైన స్థానంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ పని చేస్తున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఆమెకు షాకిచ్చే ప్రయత్నంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

ఎందుకిలా? అంటే విషయాన్ని రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లాలి. ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను రాహుల్ సావర్కర్ ను కాదని పేర్కొన్నారు. దీనిపై దేవేంద్ర ఫడ్నవీస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సావర్కర్ గురించి రాహుల్ కు ఒక్క ముక్క కూడా తెలీదని పేర్కొంటూ ట్వీట్ చేశారు. దీనికి అమృత రియాక్ట్ అయి.. థాకరే పేరును తగిలించుకున్నంత మాత్రాన అందరూ థాకరేలు అయిపోలేరంటూ ఉద్దవ్ థాక్రేను టార్గెట్ చేశారు.

దీంతో ఈ వ్యవహారం రాజకీయాన్ని మరింత వేడెక్కేలా చేసింది. శివసేన డిప్యూటీ నేత ప్రియాంక చతుర్వేది రియాక్ట్ అవుతూ అమృతకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అతను తన ఇంటి పేరుకు తగ్గట్లు జీవిస్తున్నారు.. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. అక్కడితో ఆగితే రాజకీయం ఏముంటుంది చెప్పండి.

థాకరేలను తప్పు పడుతూ అమృత ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలకు మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉందన్న సంకేతాల్ని ఇస్తూ.. తమ అధీనంలో ఉన్న థానే మున్సిపల్ కార్పొరేషన్ లోని ఉద్యోగుల శాలరీ అకౌంట్లను అమృత పని చేసే యాక్సిక్ బ్యాంక్ నుంచి ప్రభుత్వ రంగ బ్యాంక్ కు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరి మధ్య రాజకీయం ఏమో కానీ.. మధ్యలో యాక్సిక్ బ్యాంక్ పులుసులో ములక్కాయలా మారిందన్న మాట వినిపిస్తోంది.