Begin typing your search above and press return to search.

ఏపీ నేత‌ల‌కు అమిత్ షా కొత్త టార్గెట్‌

By:  Tupaki Desk   |   29 Nov 2016 7:02 AM GMT
ఏపీ నేత‌ల‌కు అమిత్ షా కొత్త టార్గెట్‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ శాఖ సొంతంగా ఎదిగేందుకు పావులు క‌దుపుతోందా? పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా రాష్ట్రానికి రావ‌డం వెనుక కొత్త టార్గెట్ ఉందా? టీడీపీతో పొత్తునే గౌర‌విస్తూనే త‌మ‌కు తాముగా బ‌ల‌మైన శ‌క్తిగా ఎదిగే "ప్లాన్ బీ" అమ‌లు అవుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. బీజేపీ శ్రేణుల స‌మాచారం ప్ర‌కారం 2019లో రాష్ట్రం నుంచి 15మంది పార్లమెంటు సభ్యులు గెలుపే లక్ష్యంగా అగ్ర‌నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పుడు తమ పార్టీ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు గతంలో గెలుపొందిన రాజమండ్రి - కాకినాడ పార్లమెంటు స్థానాలు కూడా వీరి జాబితాలో ఉన్నాయి. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర - రాయలసీమ జిల్లాల నుంచి పార్టీ తరపున ఎంపీలను గెలిపించుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారని స‌మాచారం. ఈ ప్రణాళికకు పార్టీ జాతీయ రథసారథి అమిత్ షా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా రాష్ట్రంలో బీజేపీకీ 30లక్షల సభ్యత్వాలు ఉన్నట్టు పార్టీ నేతలు చెపుతున్నారు. వీరిలో 25వేల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు. వీరు కాక ఆర్‌ ఎస్‌ ఎస్‌ శ్రేణులు ఎలాగూ ఉన్నాయి. వీరినందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు పూర్తి స్థాయిలో పార్టీకి సేవలు అందించే శ్రేణుల అవసరం ఎంతైనా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పార్టీకి పూర్తి స్థాయి సేవలు అందించేందుకు వేతనాలు చెల్లించి హోల్‌ టైమర్లను నియమించనున్నారు. ఇప్పటికే 8 పార్లమెంటు స్థానాల పరిధిలో వీరి ఎంపిక తుదిదశకు చేరినట్టు చెపుతున్నారు. ఈ ఏడాది ఆఖరిలోగా లక్ష్యంగా పెట్టుకున్న అన్ని పార్లమెంటు స్థానాల్లోను ఈ ప్రక్రియ ముగించాలని నిర్ణయించారు. మ‌రోవైపు పార్టీ తరుపున ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులకు ఆర్థిక వనరులు సమకూర్చడం ఇప్పటి వరకు ఉత్తరాధి రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. దక్షిణాదిలో అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులు తామే పెట్టుకునే సంప్రదాయం నెలకొంది. ఇది పార్టీ అభ్యర్థుల గెలుపునకు అవరోధంగా ఉందనేది అధిష్టానం ఆలోచనగా చెపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులకు నిధుల పంపిణీ చేయాలని భావిస్తున్నారు. తద్వారా గెలుపు అవకాశం ఉన్నవారు ఆర్థికంగా స్థితిమంతులు కాకపోయినా ఫర్వాలేదని, హోల్‌ టైమర్లుగా నియమితులయ్యే వారు దీనిని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించాలని దిశా నిర్థేశం చేయనున్నారు.

ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన నామినేటెడ్‌ పదవుల పందేరంపై ఏపీ బీజేన‌పీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం వహిస్తున్నప్పటికీ నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. పైగా రాష్ట్ర నాయకత్వం దీనిపై ఉదాసీనత చూపడం కూడా శ్రేణులకు మింగుడుపడటం లేదు. రాష్ట్ర నేతల్లోని అసంతృప్తి, ఆగ్రహాన్ని బీజేపీ జాతీయ‌ అధిష్టానం గుర్తించినట్టు చెపుతున్నారు. వీరిలోని ఆగ్రహాన్ని పోగొట్టేందుకు తొలివిడతలో 20 మందినేతలకు కేంద్రస్థాయి నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర కార్యవర్గంలోని ఆఫీసు బేరర్లకు తొలి ఛాన్స్‌ ఇవ్వనున్నారని స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/