Begin typing your search above and press return to search.

అమిత్ షా ఎంట్రీ ఇచ్చాకే సెట్ అయింది

By:  Tupaki Desk   |   28 Jan 2017 8:10 AM GMT
అమిత్ షా ఎంట్రీ ఇచ్చాకే సెట్ అయింది
X
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా త‌న ఉగ్ర‌రూపం దాల్చారు. అదికూడా అల్లాట‌ప్పా నేత‌ల‌పై కాదు. ఏకంగా మాజీ ముఖ్య‌మంత్రి ఒక‌రు - రాష్ట్ర స్థాయి ర‌థ‌సార‌థి ఇంకొక‌రు. ఇది కర్ణాటక బీజేపీ అగ్ర నేతలు బీఎస్‌ యడ్యూరప్ప - కేఎస్‌ ఈశ్వరప్ప గురించి. కన్నడ పోరాటయోధుడు సంగోలి రాయన్న సంస్మరణార్థం నిర్వహించనున్న సంస్మరణ కార్యక్రమాలు సంగోలీ రాయన్న బ్రిగేడ్‌ పేరిట పార్టీకి అతీతంగా కర్ణాటక శాసనమండలి ప్రతిపక్ష నేత కేఎస్‌ ఈశ్వరప్ప ప్రత్యేకంగా నిర్వహించేందుకు సిద్ధపడటంతో పార్టీలో ముసలం తలెత్తింది. ఈ కార్యక్రమాలను రాష్ట్ర బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప వ్యతిరేకించారు. దీంతో ఇరువురు నేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేచింది. దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు షా రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది.

ప‌రిస్థితి చేజారిపోవ‌డంతో రంగంలోకి దిగిన అమిత్ షా సంగోలి రాయన్న కార్యక్రమాలు పార్టీ వేదికలో ఉమ్మడిగా నిర్వహించాల్సిందేన‌ని ఇరువురు నేతలకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. పార్టీ సంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయకుంటే.. పార్టీని వీడి వెళ్లిపోవచ్చునంటూ ఇరువురు నేతలకు ఆయన ఘాటుగా చెప్పడంతో ఇద్దరు దిగొచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో యడ్యూరప్ప, ఈశ్వరప్ప ఇద్దరూ పాల్గొంటారని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు. పార్టీలో ఇరువురు అగ్రనేతల మధ్య విభేదాలతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు గందరగోళం నెలకొందని కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రులు అధిష్టానానికి నివేదించడంతో షా కల్పించుకొని ఈమేరకు ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదిర్చినట్టు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/