Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.!?

By:  Tupaki Desk   |   9 July 2019 5:35 AM GMT
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.!?
X
తెలంగాణలో బలపడాలని యోచిస్తున్న బీజేపీ తమ యాక్షన్ ప్లాన్ ను రెడీ చేసిందట. నిజానికి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటే సాధించిన బీజేపీ ఇక ఆశలు వదిలేసుకుందట.. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లను గెలవడం బీజేపీ అధిష్టానాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందట. ఈ అనూహ్య ఫలితంతో గేర్ మార్చిన బీజేపీ తెలంగాణలో బలపడే చాన్స్ ఉందని గమనించి ఇప్పుడు ఆపరేషన్ తెలంగాణ మొదలు పెట్టేసింది. నేతలను చేర్చుకునే పనికి శ్రీకారం చుట్టింది.

అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాగానే పనిచేస్తున్న బీసీ వర్గానికి చెందిన లక్ష్మన్ ఇప్పుడు మార్చడానికి అమిత్ షా రెడీ అయ్యారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. మొన్న తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చిన అమిత్ షా 20 లక్షల సభ్యత్వాలు టార్గెట్ పెట్టగా 10 లక్షలే చేయడంపై నేతలకు క్లాస్ పీకారట.. ఇక 2018 ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మన్ సారథ్యంలో వెళ్లి లక్ష్మణ్ తోపాటు కిషన్ రెడ్డి సహా అందరూ ఓడిపోవడంతో ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని తీసుకొచ్చి దూకుడుగా ముందుకు వెళ్లాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి..

తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షుడి రేసులో ప్రధానంగా ముగ్గురు పేర్లు ఇప్పుడు ఆ పార్టీలో వినపడుతున్నాయట. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళీధర్ రావు - ఎమ్మెల్సీ రాంచంద్రరావు - నిజామాబాద్ ఎంపీ అరవింద్ ల పేర్లు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి రేసులో ముందున్నాయి. అమిత్ షా వీరి ముగ్గురిలో ఒకరికి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారన్న చర్చ సాగుతోంది.

అయితే మురళీధర్ రావు - రాంచంద్రరావులు అగ్రవర్ణాలు. వెలమ సామాజికవర్గం. అందుకే బీసీ అయిన అరవింద్ కు ఇద్దామనే ఆలోచనలోనే అమిత్ షా ఉన్నారని సమాచారం. అరవింద్ ఏకంగా నిజామాబాద్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురును ఓడించడం బీజేపీ పెద్దలను ఆకర్షించింది. అరవింద్ దూకుడు - వ్యవహారశైలి బాగా నచ్చడంతో ఆయనకే పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. అయితే రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం మైనస్ అంటున్నారు. లక్ష్మణ్ బీసీ కావడంతో ఆయన స్థానంలో మరో బీసీని నియమిస్తేనే పార్టీలో సామరస్య పూర్వక వాతావరణం ఉంటుందని భావిస్తున్నారట..

అందుకే జాతీయ స్థాయిలో కీలకంగా మురళీ ధర్ రావును ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిని చేయడం మంచిదికాదన్న అభిప్రాయానికి అమిత్ షా వచ్చారట.. ఇక అగ్రవర్ణం కోటా రాంచంద్రరావుకు కూడా మైనస్ గా మారింది. అందుకే ఇప్పుడు యువకుడు - దూకుడుగా వెళ్తున్న అరవింద్ ను బీజేపీ కొత్త అధ్యక్షుడిగా చేయాలని అమిత్ షా యోచిస్తున్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే మురళీధర్ రావు - రాంచంద్రరావు - అరవింద్ లలో అమిత్ షా ఎవరిపై మొగ్గుచూపుతారన్న ఆసక్తి బీజేపీ లో తెగడం లేదని తెలుస్తోంది.