Begin typing your search above and press return to search.

అమెరికా టార్గెట్‌గారే మా అణ్వాయుధాలు: ఆ నియంత వార్నింగ్‌

By:  Tupaki Desk   |   9 Sep 2022 9:18 AM GMT
అమెరికా టార్గెట్‌గారే మా అణ్వాయుధాలు: ఆ నియంత వార్నింగ్‌
X
దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ అంత‌గా బాగోక‌పోయినా ర‌క్ష‌ణ వ్య‌యాన్ని విప‌రీతంగా పెంచేసుకుంటూ త‌ర‌చూ అణ్వాయుధ ప‌రీక్ష‌లు జ‌రుపుతున్న దేశం... ఉత్త‌ర కొరియా. త‌మ పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జ‌పాన్‌ల‌ను బెదిరిస్తూ ఉత్త‌ర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఇప్ప‌టికే అనేక మిస్సైళ్ల‌ను, అణ్వాయుధాల‌ను ప‌రీక్షించారు. ఉత్త‌ర కొరియా ప్ర‌యోగించిన క్షిప‌ణులు ప‌లుమార్లు జపాన్, దక్షిణ కొరియా భూభాగాల్లో, స‌ముద్ర జ‌లాల్లో ప‌లుమార్లు ప‌డ్డాయి.

మ‌రోవైపు ఉత్త‌ర కొరియాను ప్ర‌పంచంలోనే ధూర్త దేశంగా పేర్కొంటూ ఇప్ప‌టికే అమెరికా ఆ దేశంపై అనేక ఆర్థిక సంస్థ‌లు విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అమెరికాకు కిమ్ జోంగ్ఉన్ తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అమెరికాను తాము ల‌క్ష్యంగా చేసుకునే అణ్వాయుధాల‌ను సిద్దం చేసుకుంటున్నామ‌ని బాంబు పేల్చారు. అణ్వస్త్రాల ప్రయోగంపై అమెరికాతో గ‌తంలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ ఉత్త‌ర కొరియా దాన్ని లెక్క చేయ‌కుండా త‌ర‌చూ క్షిప‌ణి ప‌రీక్ష‌లు, అణ్వాయుధ ప‌రీక్ష‌లు చేస్తూ బెద‌ర‌గొడుతోంది. దీంతో అమెరికా మిత్ర దేశాలైన జ‌పాన్, దక్షిణ కొరియాలు కూడా త‌మ ర‌క్ష‌ణ కోసం ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి.

ఉత్తర కొరియా విచ్చ‌ల‌విడిగా అణ్వాయుధాల‌ను సిద్దం చేసుకోవ‌డం, ఖండాంత‌ర క్షిప‌ణి ప‌రీక్ష‌లు చేస్తుండ‌టంపై ఆ దేశంతో చర్చించడానికి అమెరికా ఇప్పటికే సన్నద్ధమైంది. ఇందుకు దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిగా పని చేసి.. పదవీ విరమణ చేసిన సుంగ్ కిమ్‌ను రాయ‌బారిగా ఎంపిక చేసింది. ఉత్తర కొరియా ప్రభుత్వ పెద్దలతో, ర‌క్ష‌ణ రంగ అధికారుల‌తో చర్చించడానికి సుంగ్ కిమ్ ను ఎంచుకుంది. అయితే ఉత్త‌ర కొరియా చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌వుతూ కూడా ఈ అణ్వాయుధాలు, క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌ను విడిచిపెట్ట‌డం లేదు. అమెరికా మిత్ర దేశాలు ద‌క్షిణ కొరియా, జ‌పాన్ లక్ష్యంగా చేప‌డుతున్న ప్ర‌యోగాలు ఆ దేశాల స‌రిహ‌ద్దుల్లో, స‌ముద్ర జ‌లాల్లో ప‌డుతున్నాయి.

కాగా అణ్వాయుధాల పెంపు, క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌ ప్రయోగాలపై గ‌తంలోనే అమెరికా-ఉత్తర కొరియా మధ్య చర్చలు సాగిన సంగ‌తి తెలిసిందే. దీనిపై 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్త‌ర కొరియా అధినేత‌ కిమ్ జోంగ్ ఉన్ చర్చల్లో పాల్గొన్నారు. అయితే ఈ చ‌ర్చ‌ల్లో ఏకాభిప్రాయం కుదురకపోవడంతో చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్ప‌డింది. దీంతో అమెరికా.. ఆదేశంపై ఆంక్ష‌ల‌ను పెంచింది. తీవ్ర ఆర్థిక ఆంక్ష‌లు కూడా ఇందులో ఉన్నాయి. అయినా స‌రే కిమ్ జోంగ్ ఉన్ మాత్రం బెద‌ర‌డం లేదు.

పైగా తమ దేశాన్ని కాపాడుకోవ‌డానికి అవ‌స‌ర‌మ‌యితే అణ్వాయుధాల‌ను ప్ర‌యోగించ‌డానికి వెనుకాడ‌బోమ‌న్నారు. దీనికి అవసరమైన బిల్లును ఉత్త‌ర కొరియా పార్లమెంట్ తాజాగా ఆమోదించ‌డం గ‌మ‌నార్హం. ఏ దేశంతో అయినా యుద్ధం వ‌స్తే అణ్వాయుధాల‌ను ప్ర‌యోగిస్తామంటూ ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మాట్లాడిన‌ కిమ్ జోంగ్ ఉన్ అమెరికాతో త‌మ దేశానికి యుద్ధభయాలు ఉన్నాయన్నారు. తమ దేశాన్ని ఆక్రమించుకోవడానికి అమెరికా ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు. అమెరికాను ఎదుర్కోవ‌డానికే త‌మ అణ్వాయుధాలు అన్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.