Begin typing your search above and press return to search.

భారత్ బాటలో చైనాకు షాకిచ్చేందుకు అమెరికా రెడీ!

By:  Tupaki Desk   |   7 July 2020 11:15 AM GMT
భారత్ బాటలో చైనాకు షాకిచ్చేందుకు అమెరికా రెడీ!
X
భారత్ సహా సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలుదూస్తున్న చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టడానికి ప్రపంచదేశాలన్నీ రెడీ అవుతున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన పాపులర్ టిక్ టాక్ సహా 59 యాప్స్ ను నిషేధించి భారత్ గట్టి హెచ్చరిక ఇచ్చింది. సరిహద్దుల్లో భారత్ తో యుద్ధానికి రెడీ అయిన చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ వరుసగా నిర్ణయాలు తీసుకుంటోంది. చైనా దూకుడును వ్యాపార, వాణిజ్యాలు కట్ చేసుకుంటూ భారత్ షాకిస్తోంది.

ఇప్పుడు భారత్ చూపిన బాటలో మిగతా దేశాలన్నీ ఆలోచిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు తాము చైనా యాప్ లను నిషేధించే దిశగా ఆలోచిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. టిక్ టాక్ సహా చైనా యాప్ ల వల్ల అమెరికన్ పౌరుల వ్యక్తిగత సమాచారం చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్తోందంటూ కొద్దిరోజులుగా అమెరికా డిమాండ్లు వినిపిస్తున్నాయి. భద్రతాపరంగా కూడా చైనా యాప్ లు మంచివి కావనే అభిప్రాయం ఉంది. దీంతో చైనా యాప్ లను నిషేధించే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది.

చైనా యాప్ లను తమ దేశంలో నిషేధించే అంశాన్ని తాము తీవ్రంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే దీనిపై ఓ నిర్ణయాన్ని తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ కూడా ఇదే ఆలోచిస్తున్నట్టు తెలిపారు.

తాజాగా చైనా యాప్ లను నిషేధించిన భారత్ చర్యను మైక్ పాంపియో ప్రశంసించారు. ఇక ఈ యాప్ లను నిషేధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొందరు చట్టసభల సభ్యులు కూడా ఇదే అన్నారని.. బ్యాన్ చేయాలనే డిమాండ్ దేశంలో ఉందన్నారు.