Begin typing your search above and press return to search.

దీదీ.. మరీ అంత ‘‘మమత’’ లేకుంటే ఎలా..?

By:  Tupaki Desk   |   24 Dec 2015 8:44 AM GMT
దీదీ.. మరీ అంత ‘‘మమత’’ లేకుంటే ఎలా..?
X
ప్రాణపాయంలో ఉన్న వారికి సాయం చేయటానికి ఎవరూ వెనుకాడరు. సామాన్యుల సంగతి ఎందుకు.. వీవీఐపీలు సైతం.. రోడ్ల మీద వెళుతున్నప్పుడు ఏదైనా అంబులెన్స్ కనిపిస్తే మొదట దానికే ప్రాధాన్యత ఇస్తారు. చావుబతుకుల మధ్యనున్న వారికి వైద్యం అందేందుకు వారికి ట్రాఫిక్ తో సంబంధం లేకుండా మినహాయింపులు ఇస్తుంటారు. కానీ.. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారణంగా ఒక అంబులెన్స్ ను అనుమతించకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఉదంతం గురించి విన్న వెంటనే.. చాలామందికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుకు వస్తారు. ఆయన రోడ్డు మీద వెళుతున్నసమయంలో అంబులెన్స్ లు కనిపించినా.. తన కాన్వాయ్ కు ముందు వెనుకా అంబులెన్స్ లు వెళుతున్నా.. ముందు వాటిని పోనివ్వాలని.. అపొద్దని చెబుతారు. అంతదాకా ఎందుకు.. ఆ మధ్యలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ నుంచి వచ్చే సమయంలో.. అంబులెన్స్ కనిపిస్తే.. తన కాన్వాయ్ ని ఆపేయించి మరీ.. అంబులెన్స్ కు దారి ఇచ్చిన సంగతి మర్చిపోలేం.

అంబులెన్స్ ల విషయం ప్రముఖులు సైతం తమ వంతు బాధ్యతగా జాగ్రత్తలు తీసుకుంటూ.. తమ కారణంగా ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. కానీ.. అందుకు విరుద్ధమైన వ్యవహారం పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకుంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళుతున్నారంటూ రోడ్ల మీద వాహనాలు ఆపేసిన పోలీసులు.. ఒకహార్ట్ పేషెంట్ ను తీసుకెళుతున్న అంబులెన్స్ ను సైతం ఆపేశారు. బెంగాల్ లోని డిగా ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిసిన వారు మండిపడుతున్నారు. 50 ఏళ్ల మెహర్జన్ బేగం అనేహార్ట్ పేషంత్ తీవ్ర అనారోగ్య పరిస్థితి మధ్య అంబులెన్స్ లో తరలిస్తున్నారు. అయితే.. అంబులెన్స్ వెళ్లే దారిలో ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తోందని.. అది వెళ్లే వరకూరోడ్డు మీదకు అంబులెన్స్ ను అనుమతించమని పోలీసులు తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా బేగం కుటుంబ సభ్యులు ఎంతగా బతిమిలాడినా పోలీసులు కనికరించలేదు. అంబులెన్స్ ఆపేసిన చాలాసేపటికి ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చి వెళ్లిన తర్వాత మాత్రమే అంబులెన్స్ ను విడిచిపెట్టారు.ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు రేగుతున్నాయి. మరి.. తన కారణంగా చోటు చేసుకున్న ఈ ఉదంతంపై మమత స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి.. మమత స్పందిస్తారా?