Begin typing your search above and press return to search.

తమిళనాడులో అమరరాజా కొత్త యూనిట్

By:  Tupaki Desk   |   3 Aug 2021 5:30 AM GMT
తమిళనాడులో అమరరాజా కొత్త యూనిట్
X
చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని అనుకున్న కొత్త యూనిట్ ను యాజమాన్యం తమిళనాడులో పెట్టాలని డిసైడ్ అయ్యింది. చిత్తూరు సమీపంలో అడ్వాన్సుడు లిథియం టెక్నాలజీ రీసెర్చి హబ్ ను ఏర్పాటు చేయాలని అనుకున్నది. అయితే ఈమధ్య తరచూ కంపెనీ వివాదాల్లో ఇరుక్కుంటున్నది. అమరరాజా బ్యాటరీస్ యూనిట్ నుండి ప్రమాదకరమైన రసాయనాలు విడుదలవుతున్నాయని, ఉద్యోగుల్లో సీసం ప్రమాదకరస్ధాయిని దాటి ఉందని నిర్ధారణ అయ్యింది.

యూనిట్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని బోర్లు, బావుల్లోని నీటిలో కూడా సీసం నిల్వలు ఒకస్ధాయిని దాటిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిపుణులు కూడా తేల్చారు. అంతకుముందు ఇదే విషయమై పీసీబీ అధికారులు యాజమాన్యానికి నోటీసిచ్చి మూయించేశారు. అయితే యాజమాన్యం కోర్టుకెళ్ళ ఉత్తర్వులు తెచ్చుకోవటంతో యూనిట్ ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత కొందరు స్ధానికులు కంపెనీపై కోర్టులో కేసులు వేశారు. దాంతో వాయుకాలుష్యంపై పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

యూనిట్లో నుండి వస్తున్న వాయుకాలుష్యంతో పాటు సంస్ధలో పనిచేస్తున్న ఉద్యోగుల రక్తనమూనాలను, నీటిని కూడా నిపుణుల కమిటి పరిశీలించింది. స్ధానికుల ఫిర్యాదులో చెప్పినట్లుగా నీటిలోను, ఉద్యోగుల రక్తంతో పాటు వాయుకాలుష్యంలో కూడా సీసం ప్రమాదరకరస్ధాయిలో ఉందని రిపోర్టులో చెప్పింది. దాంతో హైకోర్టే నేరుగా యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.

ప్రమాదకరమైన వాయువులు వెలువడకుండా, నీటిలో సీసం స్ధాయిని కంట్రోల్ చేయకపోతే తామే యూనిట్ మూయించేస్తామని తీవ్రంగానే హెచ్చరించింది. దానికన్నా ముందు ఉపయోగించకుండా ఖాళీగా ఉంచేసిన భూములను స్వాధీనం చేసుకోవటానికి ప్రభుత్వం యాజమాన్యానికి నోటీసు జారీచేసింది. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకునే కొత్తగా ఏర్పాటు చేయబోయే యూనిట్ ను చిత్తూరులో కాకుండా తమిళనాడులో ఏర్పాటు చేయాలని యాజమాన్యం ప్రయత్నిస్తోంది.