Begin typing your search above and press return to search.

ఎవ‌రికి ప‌డితే వారికి క‌ప్పేస్తే ఎలా కొల్లి?

By:  Tupaki Desk   |   7 July 2017 6:00 AM GMT
ఎవ‌రికి ప‌డితే వారికి క‌ప్పేస్తే ఎలా కొల్లి?
X
ఏపీ మంత్రివ‌ర్యులు కొల్లి ర‌వీంద్ర మీద స‌రికొత్త ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి హోదాలో ఉన్న ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లి.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటే ఎంతోకొంత ప‌రిష్కార‌మ‌వుతాయ‌న్న ఆశ‌తో ఆయ‌న వ‌ద్ద‌కు వెళుతున్న వారికి కొల్లి త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం షాకింగ్ గా మారింద‌ట‌. కొల్లి తీరుపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇంత‌కూ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వారిని కొల్లి ఏం చేస్తున్నార‌న్న విష‌యంలోకి వెళితే..

స‌మ‌స్య‌లు చెప్పి.. ప‌రిష్కారం కోసం మంత్రిని సాయం అడిగితే.. మెడ‌లో ప‌చ్చ కండువా వేసేసి..పార్టీలో చేరిపోయిన‌ట్లుగా ప్ర‌చారం చేస్తున్నార‌న్న విమ‌ర్శ పెరుగుతోంది. తాజాగా కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం ప‌రిధిలోని ఎస్ ఎస్ గొల్ల‌పాలెం గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ కార్య‌క‌ర్త‌లు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ మంత్రి తీరును త‌ప్పు ప‌ట్టారు.

ఈ నెల రెండున మంత్రి కొల్లు ర‌వీంద్ర సీతారామ‌పురం గ్రామంలో ప‌ర్య‌టించార‌ని.. ఆ స‌మ‌యంలో గ్రామంలోని టీడీపీ నేత మ‌ట్టా బాల‌శ్రీనివాస్ ఇంటి వ‌ద్ద ఆగార‌ని.. ఆయ‌న‌కు త‌మ స‌మ‌స్య‌లు చెబితే ప‌రిష్కారం అవుతుంద‌న్న ఆలోచ‌న‌తో ఆయ‌న్ను క‌లిశామ‌ని వెల్ల‌డించారు.

అయితే.. క‌లిసిన ఆయ‌న త‌మ‌తో మాట్లాడి.. ఆ వెంట‌నే ప‌చ్చ కండువాలు మెడ‌లో వేసి పార్టీ మారిపోయిన‌ట్లుగా ప్ర‌చారం చేశార‌ని.. ఇది స‌రైన ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు జ‌గ‌న్ పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌మ అనుభ‌వాల్ని వెల్ల‌డించారు.

మాన‌సిక విక‌లాంగురాలైన త‌న భార్య వైద్యం ఖ‌ర్చుల కోసం ప్ర‌భుత్వ సాయాన్ని కోరుతూ మంత్రి వ‌ద్ద‌కు వెళ్లాన‌ని.. త‌న స‌మ‌స్య‌ను విన‌కుండానే మెడ‌లో ప‌చ్చ కండువా వేసిన‌ట్లుగా క‌న‌ప‌ర్తి వీరాంజ‌నేయులు వెల్ల‌డించారు. కార్పొరేష‌న్ రుణాలు మంజూరైనా వాటిని ఇవ్వ‌ని బ్యాంక‌ర్ల తీరుపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా టీడీపీ కండువాలు క‌ప్పిన‌ట్లుగా మ‌రికొంద‌రు జ‌గ‌న్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆరోపించారు.

అన్నింటికి మించి మ‌రింత కామెడీ అంశం ఏమిటంటే.. రోడ్డుపై మంత్రి కారు నిల‌ప‌టంతో త‌న ట్రాక్ట‌ర్‌కు వెళ్లే దారి లేద‌ని.. ఈ నేప‌థ్యంలో ట్రాక్ట‌ర్ ఆపి రోడ్డుపై నిల‌బ‌డిన త‌మ‌పై టీడీపీ కండువాలు క‌ప్పినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు మానేప‌ల్లి రామాంజ‌నేయులు.. మ‌ట్టా సుబ్బారావు.. మ‌ట్టా వెంక‌ట రంగ ప్ర‌సాద్‌.. కొండ‌య్య‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. క‌లిసినోళ్ల‌ను క‌లిసిన‌ట్లుగా ప‌చ్చ కండ‌వాలు వేసేస్తున్న మంత్రి కొల్లు వైఖ‌రి హాట్ టాపిక్ గా మారింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.