Begin typing your search above and press return to search.

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు బంధువు

By:  Tupaki Desk   |   8 May 2016 7:18 AM GMT
చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు బంధువు
X
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరు కాటమనేని భాస్కర్ పై రాజకీయ వర్గాలన్నీ మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను బంధువునంటూ బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కేవలం చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గం కోసం మాత్రమే పనిచేస్తున్నారని మిగతా ఎమ్మెల్యేలను అస్సలు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత చాలాకాలంగా భాస్కర్ పై ఉద్యోగులు - ఉద్యోగ సంఘాలు - నేతల నుంచి కంప్లయింట్లు వచ్చాయి. తాజాగా టీడీపీ నేతలు కూడా చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.చంద్రబాబు తనకు బంధువు అని చెప్పుకుంటూ తమను దారుణంగా ట్రీట్ చేస్తున్నారని నేతలు అంటున్నారు.

చింతమనేని ప్రభాకర్ కు పూర్తిగా తొత్తుగా మారారని.. ఆయన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు మంత్రులు పీతల సుజాత - మాణిక్యాల రావులకు కూడా కలెక్టరు ఆహ్వానాలు పంపించడం లేదట. తానేదో రాజు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారంటూ తాజాగా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యానారాయణ మండిపడుతున్నారు. ఆయనపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. చింతమనేని - తణుకు నియోజకవర్గాలకు మాత్రమే ఆయన ఉపాధిహామీ పనులు కేటాయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం బంధువనంటూ ఆయన అధికారులు - ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వోద్యోగులకు సకాలంలో జీతాలు అందజేయకుండా ఇబ్బందులపాలు చేశారని ఆయన ఆరోపించారు. పితానికి మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలుకుతున్నారు.

దీంతో వెస్టు గోదావరి కలెక్టరు వ్యవహారం త్వరలో చంద్రబాబు వద్దకు చేరనున్నట్లుగా తెలుస్తోంది. నేతలకు తోడుగా ఉద్యోగ సంఘాలు కూడా కలెక్టరు భాస్కర్ పై చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే... చంద్రబాబుకు కలెక్టరు నిజంగా బంధువే అయినా కూడా ఇలా స్థాయికి మించి వ్యవహరిస్తే చంద్రబాబు ఊరుకునే ప్రసక్తి ఉండదని అంటున్నారు.