Begin typing your search above and press return to search.

ఈ దెబ్బతో లోకేష్ పని ఖతమేనా?

By:  Tupaki Desk   |   7 April 2019 7:39 AM GMT
ఈ దెబ్బతో లోకేష్ పని ఖతమేనా?
X
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి.. అప్పుడే మజా.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి, ఏపీ సీఎం కొడుకు నారాలోకేష్ ను ఓడించేందుకు వైసీపీ అభ్యర్థి వేసిన ప్లాన్ తో లోకేష్ పని ఖతమయ్యేలానే కనిపిస్తోందట.. లోకేష్ మీద వేస్తున్న ఆళ్ల వేస్తున్న ఈ బ్రహ్మాస్త్రంతో లోకేష్ ఓడిపోవడం ఖాయమన్న చర్చ జిల్లాలో సాగుతోంది.

అవసరార్థం నేతలను వాడుకొని వదిలేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేడని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతుంటుంది. లోకేష్ పోటీచేస్తున్న మంగళగిరిలోనూ బాబు చేతిలో మోసపోయిన ఆ నియోజకవర్గ ఇన్ చార్జి ఒకరు ఉన్నారు. ఆమె కాండ్రు కమల.. లోకేష్ పోటీచేయకముందే టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న కమలను తప్పించి బాబు లోకేష్ కు టికెట్ ఇచ్చాడు. కమల చేనేత కుటుంబానికి చెందిన మహిళ. మంగళగిరిలో చేనేతల ప్రాబల్యం.. ఓటు బ్యాంకు ఎక్కువ. అందుకే ఐదేళ్లుగా ఆమెకు నియోజకవర్గ ఇన్ చార్జిని ఇచ్చి చివరకు ఆమెను లోకేష్ కోసం బాబు బలిచేశాడు. దీంతో ఆమె వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణకు మద్దతు ప్రకటించి టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ తరుఫున ఆళ్లతో కలిసి ప్రచారం చేస్తున్నారు.

కాండ్రు కమలను బాబు మోసం చేయడం చేనేతలనే కాదు.. నియోజకవర్గంలోని బీసీలను అంసతృప్తికి గురిచేసింది. బీసీలందరూ ఈసారి లోకేష్ ను ఓడించడానికి మంగళగిరిలో కంకణం కట్టుకున్నారట..

అయితే సీఎం కొడుకు పోటీచేస్తుండడంతో ఇక్కడ డబ్బులు ఏరులై పారించి అధికారుల తోడ్పాటుతో గెలిపించాలని బాబు పెద్దపెద్ద స్కెచ్ లు వేస్తున్నాడట.. లోకేష్ ను గెలిపించడానికి ఏం చేయడానికైనా రెడీ అయ్యారట.. దీంతో అలెర్ట్ అయిన వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు..

తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే.. 2024లో అశేషంగా ఉన్న చేనేత వర్గానికే సీటును వదిలేస్తానని.. తాను జగన్ ను ఒప్పించి ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. ఈసారి తనను గెలిపించి వచ్చేసారి మీరే ఎమ్మెల్యేగా గెలవండని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ప్రకటన బీసీలు, చేనేతలను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీంతో లోకేష్ బాబు ఓటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు. మరి మంగళగిరిలో ఆళ్ల బ్రహ్మాస్త్రంతో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరి..