Begin typing your search above and press return to search.

అచ్చెన్నాయుడును అడ్డంగా బుక్ చేసిన వైసీపీ

By:  Tupaki Desk   |   5 April 2017 5:03 AM GMT
అచ్చెన్నాయుడును అడ్డంగా బుక్ చేసిన వైసీపీ
X
ఏపీ కార్మిక శాఖా మంత్రి అచ్చెన్నాయుడుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. మాట‌ల్లో చెప్తున్న‌ది ఒక‌టి, చేత‌ల్లో చేయిస్తున్న‌ది ఇంకొక‌టని ప్ర‌భుత్వం - మంత్రి అచ్చెన్నాయుడు తీరును నిరూపించింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని నల్లంవారితోటలో ఉన్న ఆనంద ఆక్వా పరిశ్రమ వ్యర్థాలన్నీ పైపులైన్‌ ద్వారా నేరుగా గొంతేరు డ్రెయిన్‌ లోకే వదులుతున్నారని, పైపులైన్‌ తొలగించినట్లు అసెంబ్లీలో మంత్రి అచ్చెనాయుడు చెప్పిన మాటలు అబద్దాలని వైసీపీ నాయకులు నిరూపించారు. తామొక్క‌ర‌మే కాకుండా అఖిల‌ప‌క్షం రూపంలో వైసీపీ త‌న కార్యాచ‌ర‌ణ చేప‌ట్టింది. వైసీపీ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా అధ్యక్షుడు - ఎమ్మెల్సీ ఆళ్ల నాని - సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం ఆధ్వర్యాన మీడియాను - రైతులను వెంటతీసుకుని ఆనంద ఆక్వాపరిశ్రమ వ్యర్థాల ట్యాంకును - పడవలపై వెళ్లి గొంతేరు డ్రెయిన్‌ లోకి అమర్చిన పైపులైన్‌ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా గొంతేరులోకి పైపులైన్‌ ద్వారా కలుస్తున్న రొయ్యల తలలు వంటి వ్యర్థాలు మత్స్యకారులు నీటిలోంచి తీసి చూపించారు. గొంతేరు డ్రెయిన్‌ లోని చేపలు - తాబేళ్లు చనిపోతున్నాయని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చేపల వేటపై బతికే 40 వేల మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని వాపోయారు. తాగు, సాగునీరు కలుషితమై తమ పరిస్థితి అధ్వానంగా తయారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలన అనంతరం వైసీపీ నేత ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఐదుగురు చనిపోయారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. యాజమాన్యం ప్రయోజనాలను కాపాడేందుకు గొంతేరులోకి వేసిన పైపులైన్‌ తొలగించినట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి చెప్పారని, ఇప్పటికీ పైపులైన్‌ అలానే ఉందని చూపించారు. అచ్చెనాయుడు వస్తే వాస్తవాలు చూపిస్తామన్నారు. చిన్న పరిశ్రమలో ప్రమాదం జరిగితేనే పరిస్థితి ఇలా ఉంటే, 300 టన్నుల ఉత్పత్తి కోసం నిర్మిస్తున్న తుందుర్రు వంటి పరిశ్రమలో ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఐదుగురు చనిపోవడానికి కారణమైన యాజమాన్యాన్ని శిక్షించాలన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల ఆరో తేదీలోపు సమస్యను పరిష్కరించకపోతే ఏడో తేదీనుంచి నిరసన దీక్ష చేపడతానని చెప్పారు.

కాగా, విష వాయువు కారణంగానే ఐదుగురు మృతి చెందినట్లు కలెక్టర్‌ - ఎస్పీ - మంత్రులు సైతం ఆ రోజు చెప్పారని, తర్వాత విద్యుద్ఘాతంతో మృతి చెందినట్లు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నార‌ని సీపీఎం నేత‌లు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదికను తారుమారు చేస్తారేమోననే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయని అన్నారు. కార్మికుల మృతి పట్ల యాజమాన్యం ఇప్పటికీ విచారం వ్యక్తం చేయకపోవడం దారుణమ‌ని, యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్ర‌భుత్వం అబ‌ద్ద‌పు ప్ర‌క‌ట‌న‌లు మాని వేసి మ‌త్స్య‌కారుల‌కు న్యాయం చేయాల‌ని వైసీపీ సహా ఇత‌ర పార్టీల నేత‌లు డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/