Begin typing your search above and press return to search.

అన్ని జిల్లాలు.. ఆయా కులాల్ని లైట్ తీసుకోవటమా జగన్?

By:  Tupaki Desk   |   11 April 2022 4:36 AM GMT
అన్ని జిల్లాలు.. ఆయా కులాల్ని లైట్ తీసుకోవటమా జగన్?
X
రాష్ట్ర మంత్రి వర్గం అంటే ఎలా ఉండాలి? సమన్యాయం సూత్రాన్ని పక్కాగా పాటించాలి. అదే సమయంలో అన్ని వర్గాలకు.. అన్ని జిల్లాలకు దాదాపుగా సమాన ప్రాతినిధ్యం అన్నట్లు ఉండాలే కానీ కొందరికి ఎక్కువ.. మరికొందరికి తక్కువ అన్నట్లు ఉండకూడదు. అంతకు మించి.. కొందరికి మీద అతి ప్రేమ చూపించి.. మరికొందరికి మొండిచేయి చూపించటం కూడా సరికాదు. తాజాగా జగన్ కేబినెట్ 2.0లో ఇలాంటి తప్పులు బోలెడన్ని కనిపిస్తున్నాయి.

ఉమ్మడి 13 జిల్లాల్ని ఈ మధ్యన 26 జిల్లాలుగా చేయటం తెలిసిందే. ఉమ్మడి జిల్లాల విషయానికి వస్తే.. దాదాపు అన్ని జిల్లాల్ని కవర్ చేసినా.. కీలకమైన క్రిష్ణా.. కడప.. ప్రకాశం.. నెల్లూరు జిల్లాలకు కేవలం ఒకరు చొప్పున మాత్రమే పదవి దక్కింది. అదే కొత్త జిల్లాల విషయానికి వస్తే.. దాదాపు ఎనిమిది కొత్త జిల్లాలకు జగన్ 2.0 టీంలో ప్లేస్ లేని పరిస్థితి. అంటే.. మొత్తం 26 జిల్లాలకు దగ్గర దగ్గర 30 శాతం వరకు అసలు ప్రాతినిధ్యం లేకపోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

అంతేకాదు.. సామాజిక వర్గాల విషయంలోనూ ఎంపిక పలు వర్గాల వారికి అశనిపాతంగా మారిందని చెప్పాలి. జగన్ 1.0లోనూ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చోటు దక్కలేదు. ఇక.. 2.0లోనూ అలాంటి పరిస్థితే. బ్రాహ్మణ సామాజిక వర్గానికి మాత్రమే కాదు.. 1.0లో ప్రాతినిధ్యం లభించిన వైశ్య సామాజిక వర్గానికి తాజా కేబినెట్ లో మొండిచెయి చూపించారు.

అదే విధంగా క్షత్రియ.. కమ్మ సామాజిక వర్గానికి చోటు లభించలేదు. ఓట్ల శాతాన్ని లెక్కలోకి తీసుకున్నా కనీసం ఒక్కొక్కటి చొప్పున అయినా పదవి ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇలా.. అటు జిల్లాలకు సంబంధించి తీవ్ర నిరాశకు గురైన వారి వేదన ఒకలా ఉంటే.. కొన్ని సామాజిక వర్గాల్ని పిచ్చ లైట్ అన్నట్లుగా తీసుకోవటాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. తాము సైతం జగన్ ను అభిమానించామని.. ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు తాము చేసిన ప్రయత్నాల్ని వదిలేసి.. ఇలా మొండి చేయి చూపిస్తారా? అన్న ఆగ్రహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

అందరికి న్యాయం చేస్తానని చెప్పి.. కొందరిని అందలానికి ఎక్కించి.. మరికొందరిని ఐడెంటిటీ లేకుండా చేస్తారా? అంటూ ఆవేశంగా ప్రశ్నిస్తున్న వారిని అనునయిస్తూ ఏం చెబుతారన్నది ఇప్పుడు కుతూహలంగా మారింది.