Begin typing your search above and press return to search.

పాపికొండల ప్రయాణం మొదలయ్యేదెప్పుడు?

By:  Tupaki Desk   |   24 Nov 2020 6:29 PM GMT
పాపికొండల ప్రయాణం మొదలయ్యేదెప్పుడు?
X
గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం నుంచి పాపికొండలు విహారయాత్రకు వెళుతున్న రాయల్ వశిష్ట బోటు గోదావరిలో మునిగిపోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 77 మంది ప్రయాణికులతో బయలుదేరిన రాయల్ వశిష్ట దేవీపట్నంలోని కచ్చలూరు వద్ద సుడిగుండంలో చిక్కుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి 26మంది సురక్షితంగా బయటపడ్డారు. బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 44 మృతదేహాలు వెలికితీశారు. మరో 7 మృతదేహాల లభ్యం కాలేదు. ప్రమాదం జరిగిన నెలరోజుల తర్వాత ఆ బోటును ధర్మాడి సత్యం టీం వెలికితీసింది. ఆ ప్రమాదం తర్వాత గోదావరిలో పర్యాటక లాంచీలపై ఆంక్షలు విధించారు. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ రావడంతో ఇప్పటివరకు ఆ ఆంక్షలు కొనసాగుతున్నాయి. టూరిజం లాంచీలను పరిశీలించి అనుమతులిచ్చిన తర్వాతే వాటిని తిప్పాలని టూరిజం అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ పాపికొండల ప్రయాణం ఎప్పుడని పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏపీలోని ప్రముఖ విహార యాత్రా ప్రదేశాల్లో పాపికొండలు ఒకటి. పాపి కొండల నడుమ ప్రకృతి అందాలను తిలకిస్తూ బోటులో ప్రయాణం చేసేందుకు ఇరు తెలుగురాష్ట్రాల నుంచి ఎంతోమంది పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. పాపికొండల్లో నడిచే బోట్లపై ప్రత్యక్షంగా 2 వేల మంది, పరోక్షంగా మరో 3 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇపుడు వారందరికీ ఉపాధి పోయిందని, ఓనర్లే వచ్చి బోట్లకు కాపలా కాయాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. 30-40 సంవత్పరాలు వెనక్కు పోయినట్టు అనిపిస్తోందని బోట్ల ఓనర్లు అభిప్రాయపడుతున్నారు. అధికారులు బోట్లను పరిశీలించి వెళుతున్నారని, అనుమతులు వచ్చేందుకు ఇంకా సమయం పడుతోందని చెబుతున్నారని అంటున్నారు. అయితే, త్వరలోనే పర్యాటక బోట్లను పూర్తిస్థాయిలో పరిశీలించి అనుమతులిస్తామని పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు. ఇన్ లాండ్ వాటర్స్ లో బోట్లు ఎలా తిప్పాలి అన్న విషయాలపై సిబ్బందికి తర్ఫీదునిస్తామని, బోట్లపై సర్వే చేసి రిజిస్టర్ చేస్తామని అధికారులు అంటున్నారు. త్వరలోనే పాపికొండల్లో విహార యాత్ర మొదలయ్యే అవకాశముందని చెబుతున్నారు.