Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ పై లోక‌ల్ లొల్లి మొద‌లైంది

By:  Tupaki Desk   |   13 Sep 2016 10:59 AM GMT
ప‌వ‌న్‌ పై లోక‌ల్ లొల్లి మొద‌లైంది
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా అంశంపై కాకినాడ స‌భ‌లో బీజేపీ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు చేసిన జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు ఇపుడు కొత్త రూపంలో కౌంట‌ర్లు ఎదుర‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఆ పార్టీ జాతీయనేత‌లు ముఖ్యంగా రాష్ట్ర వ్య‌వహారాల ఇంచార్జీ సిద్ధార్థానాథ్ సింగ్ స్పందించగా ఇపుడు స్థానిక నాయ‌కులు ప‌వ‌న్‌ పై కౌంటర్లు మొద‌లుపెట్టేశారు.

బీజేపీ ఎమ్మెల్యే శాసనసభలో చీఫ్ విప్ ఆకుల సత్యనారాయణ తాజాగా ప‌వ‌న్‌ కు స‌వాల్ విసిరారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతో ఒనగూడే ప్రయోజనాలపై పవన్ కల్యాణ్‌ తో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు సత్య‌నారాయ‌ణ చాలెంజ్ చేశారు. త‌న స‌వాలుకు స్పందించాల‌నుకుంటే పూర్తి వివ‌రాల‌తో రావాల‌ని ఆయ‌న సూచించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. రెండున్నరేళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని ఈసంద‌ర్భంగా వివరించారు. అంధకారంలో ఉన్న రాష్ట్రానికి 24 గంటలు కరెంటు సరఫరా చేసి విద్యుత్ సమస్యలు తొలగించామన్నారు. కేటాయించిన 11 జాతీయ విద్యా సంస్థల్లో ఐఐటి - ఐఐఎం - ఎయిమ్స్ - ఐఐఎస్‌ ఇఆర్ - ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలకు ఇప్పటికే శంకుస్థాపన జరిగిందన్నారు. పోల‌వరం ముంపు మండలాలను ఏపీ కలిపి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకులను కేంద్రం తొలగించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును 100 శాతం భరిస్తుందని చెప్పారు. బడ్జెట్‌ తో సంబంధం లేకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని నిధులు విడుదల చేస్తుందన్నారు. రైల్వే జోన్ కూడా త్వరలో విశాఖలో ఏర్పాటు చేస్తామన్నారు. విభజన సమయంలో రాజ్యసభలో వెంకయ్యనాయుడు - అరుణ్ జైట్లీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారన్నారు. నాడు మాట్లాడని కాంగ్రెస్ - వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీలు నేడు రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా అనేది సాంకేతికంగా ఇవ్వడం కుదరనందు వల్లే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసినట్లు పవన్ కల్యాణ్ ఆరోపించడం సరికాదన్నారు. పవన్ కల్యాణ్‌ లో జాతీయ వాదాన్ని గుర్తించిన నరేంద్రమోడీ ఆయనను ప్రమాణ స్వీకారం సమయంలో పార్లమెంటు సెంట్రల్ హాలుకు ఆహ్వానించినట్లు చెప్పారు. పవన్ కల్యాణ్ రెండున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఇప్ప‌టికైనా ప‌వ‌న్ ప్ర‌త్యేక హోదా - ప్యాకేజీ గురించి మాట్లాడాలి అనుకుంటే స్పందించేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు చాలెంజ్ చేశారు.