Begin typing your search above and press return to search.

మరో వివాదంలో అఖిలప్రియ!

By:  Tupaki Desk   |   14 Jan 2023 2:50 PM GMT
మరో వివాదంలో అఖిలప్రియ!
X
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి గెలిచి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు.. అఖిలప్రియ. అందుకు ప్రతిఫలంగా పర్యాటక శాఖ మంత్రి పదవిని కూడా పొందారు. ఈ వ్యవహారంలో విమర్శలు వచ్చినా ఆమె లెక్కచేయలేదు.

కాగా గత ఎన్నికల్లో ఆళ్లగడ్డలో ఆమెకు ఓటమి ఎదురైంది. అలాగే ఆమె పెదనాన్న కుమారుడు భూమా బ్రహ్మనందరెడ్డి కూడా నంద్యాలలో ఓడిపోయారు.

ఓటమి తర్వాత భూమా అఖిల ప్రియ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. తన తండ్రి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించడానికి సుపారీ ఇచ్చారనే ఆరోపణలు ఆమెపై వచ్చాయి. అలాగే హైదరాబాద్‌ లో అత్యంత విలువైన స్థలం వివాదం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంధువులను కిడ్నాప్‌ చేయించి.. ఆ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో అఖిలప్రియ జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బెయిల్‌ పై బయటకొచ్చారు.

ఆ తర్వాత అఖిల ప్రియ సొంత తమ్ముడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. అఖిలప్రియతోపాటు తన రెండో అక్క భూమా మౌనికా రెడ్డిలపైన కూడా జగత్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఆస్తి వివాదాలే ఇందుకు కారణమని వార్తలు వచ్చాయి.

ఈ వివాదాలు చాలవన్నట్టు తాజాగా తమ అప్పులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలప్రియ బంధువులే ఆమె ఇంటి ఎదుట నిరసనకు దిగారు. దివంగత భూమా నాగిరెడ్డి అన్న భాస్కర్‌రెడ్డి కుమార్తె ఉమామహేశ్వరి పలు దఫాలుగా తన చిన్నాన్న నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియలకు సుమారు రూ.11 కోట్లు ఇచ్చారని అంటున్నారు.

అలాగే భూమా నాగిరెడ్డి పెద్దన్న ప్రతాప్‌రెడ్డి కుమార్తె రాజీ కూడా రూ.2 కోట్లు నాగిరెడ్డి కుటుంబానికి అప్పుగా ఇచ్చారు. భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ ఇద్దరూ రాజకీయాల్లో ఉండటం, ఆర్థిక అవసరాలు ఉండటంతో భూమా నాగిరెడ్డి జీవించి ఉండగా తాము అప్పు ఇచ్చామని అఖిలప్రియ బంధువులు చెబుతున్నారు. తామిచ్చిన మొత్తానికి అసలు, వడ్డీ కలిపి భారీ మొత్తమైనా ఇంతవరకు అఖిలప్రియ ఉలకనూ పలకనూ అన్నట్టు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తాము సైతం తమ బంధువులు, స్నేహితుల వద్ద అప్పు తెచ్చి తమ చిన్నాన్న భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలకు ఇచ్చామని.. ఇప్పుడు ఆమె తమకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ కూడా చెల్లించకపోవడంతో తామే ఆ వడ్డీలు కూడా కట్టుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఇంటి ముందు భూమా భాస్కర్‌రెడ్డి కుమార్తె మహేశ్వరి, ఆమె భర్త బూచుపల్లి మురళీధర్‌రెడ్డి, భూమా ప్రతాప్‌రెడ్డి కుమార్తె రాజీ, ఆమె భర్త, గుంతకల్లుకు చెందిన ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్‌ సాయి మహేశ్వరరెడ్డిలతో పాటు వీరికి మద్దతుగా భూమా నాగిరెడ్డి చిన్నాన్న కుమారుడు, దొర్నిపాడు మాజీ ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, ఆయన కుమారుడైన తెలుగు యువత రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ భూమా సంతోష్‌రెడ్డి నిరసనకు దిగడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

మరోవైపు అఖిలప్రియ మీకు ఎలాంటి బాకీ లేనని, తాను ఏమైనా రాసిచ్చిన పత్రాలు ఉంటే చూపాలని అఖిలప్రియ అనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు మధ్యవర్తులు బంధువులను సముదాయించి బయటకు తీసుకొచ్చారని సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎస్‌ఐ వెంకటరెడ్డి అక్కడికి చేరుకొని అఖిలప్రియ బంధువులకు సర్దిచెప్పారు. అయినప్పటికీ, బాధితులు అఖిలప్రియ ఇంటి ఎదుట నిరసన కొనసాగించారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి అఖిల ప్రియకు టికెట్‌ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీలో ఉన్న అఖిల ప్రియకు ఆ పార్టీ నిర్వహించే ముఖ్య సమావేశాలకు ఆహ్వానం కూడా ఉండటం లేదని టాక్‌ నడుస్తోంది. ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటే అఖిల ప్రియ రాజకీయ భవిష్యత్‌ ప్రమాదంలో పడినట్టేనని చెప్పుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.