Begin typing your search above and press return to search.

అఖిల ప్రియ‌... వాట‌మ్మా? వాటీజ్ దిస్ అమ్మా?

By:  Tupaki Desk   |   15 Nov 2017 8:00 AM GMT
అఖిల ప్రియ‌...  వాట‌మ్మా? వాటీజ్ దిస్ అమ్మా?
X
చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్టు- అని.. వెన‌క‌టికి పెద్ద‌లు చెప్పిన సామెత‌.. ఇప్పుడు అక్ష‌రాలా ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ విష‌యంలో నిజం అవుతోంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఆమె మంత్రి ప‌ద‌వి చేప‌ట్టి.. దాదాపు 5 నెల‌ల పైగానే అయింది. ప్ర‌భుత్వం అత్యంత కీల‌కంగా భావిస్తున్న, ముఖ్యంగా ఆర్థికంగా ప్ర‌భుత్వానికి వెన్నుద‌న్న‌గా నిలుస్తుంద‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్న ప‌ర్యాట‌క రంగానికి అఖిల ప్రియ మంత్రిగా ఉన్నారు. అయితే, ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు ఆ శాఖ‌కు సంబంధించి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో? ఎన్ని సార్లు స‌మీక్ష‌లు చేశారో? అస‌లు రాష్ట్రంలో ప‌ర్యాట‌కం ప‌రిస్థితి ఏమిటో? కూడా తెలియ‌ని ప‌రిస్థితిలో ఆమె ఉన్నారు.

మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక ఎవరికైనా ఆ శాఖ‌పై ప‌ట్టు ఉండాలి. అయితే, అఖిల ప్రియ ఎన్న‌డూ ప‌ట్టు సాధించేందుకు ప్రయ‌త్నించిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. ఈ విష‌యం తాజాగా వెలుగు చూసింది. కృష్ణాన‌దిలో విజ‌య‌వాడ‌కు స‌మీపంలోని ఫెర్రీ వ‌ద్ద ఓ బోటు ప‌డిపోయిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌లో 22 మంది అమాయ‌కులు డ‌బ్బులు ఇచ్చి మ‌రీ(బోటు ప‌ర్య‌ట‌న‌కు రూ.300 చెల్లించారు క‌దా!) ప్రాణాలు కోల్పోయారు. మ‌రి ఇంత పెద్ద దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ఆ శాఖ‌కు మంత్రిగా ఉన్న అఖిల ప్రియ ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎంత వేగంగా చ‌ర్య‌లు ప్రారంభించాలి? కానీ, ఆ దూకుడు ఆమెలో ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

అంతేకాదు, 22 మంది చ‌నిపోయాక కానీ, రాష్ట్రంలోని న‌దుల్లో ప్రైవేటు బోట్లు తిరుగుతున్న విష‌యం ఆమె దృష్టికి రాక‌పోవ‌డం మ‌రింత విడ్డూరంగా ఉంది. బోటు నిర్వాహ‌కుల‌తో ఆమె తాజాగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్రైవేటు వ్య‌క్తులు బోటు న‌డిపేట‌ప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయ‌ని అన్నారు. వాస్త‌వానికి రూల్స్ అనేవి ప్రైవేటు, ప్ర‌భుత్వం.. ఇద్ద‌రికీ ఒక్క‌టే అయితే, అమ‌లు చేసే విధానంలోనే తేడా ఉంటుంది. ఈ విష‌యాన్ని సూటిగా చెప్ప‌కుండా అఖిల ప్రియ ఏదేదో మాట్లాడార‌ని ఏపీ టీడీసీ అధికారులే చెవులు కొరుక్కున్నారు.

అంతేకాదు, ఈ ఒక్క ప్ర‌మాదంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్నవిధానాల‌ను సైతం మార్చేస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు. బోట్లు నడిపేందుకు ఇస్తున్న అనుమతులకు సంబంధించి విధానాలను మారుస్తామని తెలిపారు. ప్రస్తుతం జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకునే వెసులుబాటు ఉందని, అనుమతులు తీసుకున్న వారు పర్యాటక శాఖతో ఒప్పందం చేసుకోవట్లేదని మంత్రి అన్నారు. ఈ లోపాలు సరిదిద్దేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్త పర్యాటక విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, మంత్రిగా అధికారం చేప‌ట్టి ఐదు నెల‌లు గ‌డిచాక కానీ, అఖిల ప్రియ‌కు ఈ విధానాలు తెలియ‌లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు విశ్లేష‌కులు. మ‌రి బాబు విజ‌న్ ఇదేనా, ఇలాంటి మంత్రుల‌తోనే విజ‌న్ సాధిస్తారా? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు.