Begin typing your search above and press return to search.

`రాళ్ల‌గ‌డ్డ`ర‌చ్చ‌కు బాబు చెక్ పెట్టినా..ఫ‌లితం తేల‌లేదు

By:  Tupaki Desk   |   27 April 2018 1:08 PM GMT
`రాళ్ల‌గ‌డ్డ`ర‌చ్చ‌కు బాబు చెక్ పెట్టినా..ఫ‌లితం తేల‌లేదు
X
క్ర‌మ‌శిక్ష‌ణ‌కు తాము కేరాఫ్ అడ్ర‌స్ అని చెప్పుకొనే టీడీపీలో విబేధాలు శృతిమించి రాళ్ల దాడి చేసుకునే స్థాయికి ప‌రిస్థితి చేరిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆళ్ల‌గ‌డ్డ‌లో జ‌రిగిన రాళ్ల‌దాడి ర‌చ్చ‌పై బాబు మూడు రోజులు నాన్చి ఎట్ట‌కేల‌కు తేల్చారు. అయితే అది పూర్తి స్థాయి ప‌రిష్కారంగా క‌నిపించ‌డం లేద‌ని పార్టీ వ‌ర్గాలే చ‌ర్చించుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. ఆళ్ల‌గడ్డ‌లో టీడీపీ నేత‌లు సుబ్బారెడ్డి, మంత్రి ల‌ఖిల‌ప్రియ రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన సంగ‌తి తెలిసిందే. సైకిల్‌ యాత్ర చేస్తున్న సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరగడంతో టీడీపీలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తన సమక్షంలో పంచాయితీకి అఖిలప్రియ - సుబ్బారెడ్డిలను ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన పంచాయితీకి అఖిలప్రియ గైర్హాజరు కాగా, శుక్రవారం రావాలని ఆదేశించి వారితో చ‌ర్చించారు.

సమావేశం అనంత‌రం సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశానుసారం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని తెలిపారు. ఇకపై స‌మ‌న్వ‌యం చేసుకొని ముందుకు సాగుతామ‌ని వివ‌రించారు. మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ.. అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. పార్టీ మాకు ఎంతో చేసిందని, మా నాన్న లేకపోయినప్పటికీ పార్టీ మాకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చింద‌న్నారు. ఏవీ సుబ్బారెడ్డి ఏది చెబితే అది చేస్తామని - ఆయన సలహాలు - సూచనలు తీసుకుంటామని అన్నారు. ఏవీ సుబ్బారెడ్డి కార్యకర్తలు - మా కార్యకర్తలు కలిసి పనిచేస్తారని, కర్నూలు జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తామని ఆమె వెల్ల‌డించారు. అయితే ఇదే స‌మ‌యంలో ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడకుండానే వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం. ఆళ్లగడ్డ వివాదమనేది టీ కప్పులో తుఫాను వంటిదని, చాలా చిన్న సమస్య అని, వివాదం సమసి పోయిందని, ఇరు వర్గాలు పార్టీ కోసం కలిసి పనిచేస్తాయని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వర్ల రామయ్య తెలిపారు. అయితే సుబ్బారెడ్డి ముక్త‌స‌రి స్పంద‌న‌తో వివాదం ప‌రిష్కారం అయింద‌ని భావించ‌డం కంటే తాత్కాలిక శాంతి నెల‌కొంద‌నేది స‌రైన స్థితి అని ప‌లువురు పేర్కొంటున్నారు.