Begin typing your search above and press return to search.

దోవల్ మాటల మీద ఎంత రచ్చ చేస్తారో..?

By:  Tupaki Desk   |   2 Jun 2016 7:46 AM GMT
దోవల్ మాటల మీద ఎంత రచ్చ చేస్తారో..?
X
మరే దేశంలోనూ కనిపించని ఒక చిత్రమైన వాతావరణం మనదేశంలో కనిపిస్తుంది. మేధావి వర్గంగా ఫీలయ్యే వారి నోటి నుంచి వచ్చే మాటలు మహా చిత్రంగా ఉంటాయి. ఒక దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించిన వ్యక్తి పట్ల సానుభూతి.. వారి పట్ల అభిమానాన్ని ప్రదర్శించటం.. చట్టం విధించిన శిక్షను అమలు చేసే సమయంలో ఉద్రిక్తత.. నిరసనలు చోటు చేసుకోవటం లాంటి సర్వ దరిద్రాలు మనదేశంలోనే కనిపిస్తాయి. అదేమంటే.. అసలుసిసలు ప్రజాస్వామ్యం ఇదే అంటూ చిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొస్తారు.

ఇలాంటి మాటలు చెప్పే పెద్ద మనుషుల మానప్రాణాలకు ఏ మాత్రం ఇబ్బంది ఎదురైనా అంతెత్తున ఎగిరిపడతారు. ఓపక్క తీవ్రవాదులు.. ఉగ్రవాదుల పట్ల సానుభూతి ప్రదర్శించే ఈ పెద్దమనుషులు.. వారి కారణంగా బాధితులుగా మారితే ఏం చేస్తారన్న ప్రశ్నను సంధిస్తే మాత్రం సూటిగా సమాధానం చెప్పకుండా ఏవేవో కబుర్లుచెబుతుంటారు. లేకపోతే.. అఫ్జల్ గురు లాంటి వ్యక్తిని ఉరి తీస్తే దాని మీద రచ్చ ఏమిటో అర్థం కాదు.

ఈ మేధావి వర్గం చెప్పేదేమంటే.. అఫ్జల్ తప్పు చేసి ఉంటేవెంటనే శిక్ష వేయాలి కదా? ఇప్పుడే ఎందుకు వేశారన్న రంధ్రాన్వేషణ చేస్తారే తప్పించి.. సంకుచిత రాజకీయాల కోసం అతడికి విధించిన శిక్షను అమలు చేసే విషయంలో నాన్చుడు ధోరణిని మాత్రం ప్రశ్నించరు. అలాంటి వైఖరిని తప్పు పట్టరు. వందలాది మంది ప్రాణాల్నితీసిన యాకూబ్ మెమన్ విషయంలోనూ అంతే.

దేశాన్ని నష్టపర్చేవారు.. ఈ దేశంలో శాంతిభద్రతలకు సవాలుగా నిలిచి.. అమాయకుల ప్రాణాల్ని నిర్దాక్షిణ్యంగా తీసే వాడికి విధించిన శిక్షను అమలు చేసిన దానికి ఇంత హడావుడి అవసరమా? అన్నది ప్రశ్న. మరింత దారుణమైన విషయం ఏమిటంటే.. ఈ తరహాలో మాట్లాడే వారే అసలుసిసలు మేధావులని..ప్రజాస్వామ్యవాదులన్న ట్యాగ్ లైన్ కడుతుంటారు. అందుకు భిన్నంగా అఫ్జల్ గురు.. యాకూబ్ మెమన్ లను ఉరి తీయటం తప్పు కాదన్న వారికి మతతత్వ ముద్ర వేసే చిత్రం మన దేశంలో మాత్రమే కనిపిస్తోందేమో.

అందుకే కాబోలు.. ఈ తరహా ఉదంతాలపై ప్రముఖులు గళం విప్పేందుకు సైతం వెనుకాడుతుంటారు. నిజాయితీగా మాట్లాడినా తమ మాటలకు పెడర్థాలు తీసి వివాదంలో ముంచేస్తారన్న భయంతో వారు నోరు విప్పకుండా ఉంటారు. అయితే.. అందుకు భిన్నంగా కొందరు ప్రముఖులు అప్పుడప్పడు తమ గుండెల్లోని ఆవేదనను మాటల రూపంలో వ్యక్తం చేస్తుంటారు. తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. సంచలనంగా మారిన ఆయన మాటలు ఇప్పుడు కొత్త చర్చగా మారాయి.

ఢిల్లీలోని జేఎన్ యూలో అప్ఝల్ గురు వర్థంతి సందర్భంగా విద్యార్థులు కొందరు దేశ వ్యతిరేక నినాదాలు చేసిన విషయంలో మౌనంగా ఉండటం దేశాన్ని నాశనం చేయటంతో సమానంగా ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి ఈ మాటలు సంచలన వ్యాఖ్యలు కావు. కానీ.. ఈ తరహా మాటలు సంచలన వ్యాఖ్యలుగా మీడియా సైతంఅభివర్ణించటం చూస్తేనే.. ఈ దేశంలో నెలకొన్న దరిద్రం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. ఫూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న దోవల్.. జేఎన్ యూ లాంటి సంఘటనల విషయంలో సమాజం మౌనంగా ఉంటే దేశం నాశనమవతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని వార్తల కోసం వచ్చిన ఘటనల మాదిరి చూడొద్దంటూ ఆయన కోరారు. దోవల్ లాంటి వాళ్లు కాస్త ధైర్యం చేసి మాట్లాడితే చాలు.. గగ్గోలు పెట్టేసే మేధావి వర్గం ఈసారి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.