Begin typing your search above and press return to search.

క్రికెట్లో కొత్త రూల్స్‌... సూప‌ర్ ఓవ‌ర్‌ పై సూప‌ర్ ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   15 Oct 2019 5:14 AM GMT
క్రికెట్లో కొత్త రూల్స్‌... సూప‌ర్ ఓవ‌ర్‌ పై సూప‌ర్ ట్విస్ట్‌
X
ఈ సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ గుర్తుందా ? న్యూజిలాండ్ - ఇంగ్లండ్ మధ్య జ‌రిగిన ఈ మ్యాచ్‌ లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది ఎంత ఉత్కంఠ అనుభ‌వించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముందుగా రెండు జ‌ట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఆ త‌ర్వాత సూప‌ర్ ఓవ‌ర్ నిర్వ‌హించ‌గా అందులో కూడా స్కోర్లు స‌మం కావ‌డంతో చివ‌ర‌కు విజేత ఎవ‌రే తేల్చేందుకు బౌండరీల‌ను లెక్కించారు. ఇందులో ఇంగ్లండ్ ఎక్కువ బౌండ్రీలు కొట్ట‌డంతో ఆ జ‌ట్టును విజేత‌గా తేల్చేశారు.

ఈ విధానంపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. క‌ప్ గెలిచింది ఇంగ్లండ్ అయినా ఓడిన న్యూజిలాండ్ ప్ర‌పంచ క్రీడాభిమానుల మ‌న‌స్సుల‌ను గెలుచుకుంది. ఇక ఈ విధానంపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఐసీసీ సూపర్ ఓవర్ నిబంధనలు మార్చేసింది. సూపర్ ఓవర్ కూడా టై అవుతుంటే - ఫలితం వచ్చేంత వరకూ సూపర్ ఓవర్లను ఆడిస్తూనే ఉండాలని స్పష్టం చేసింది.

అంటే ఓ సూప‌ర్ ఓవ‌ర్ టై అయితే మ‌ళ్లీ రెండు జ‌ట్ల మ‌ధ్య సూప‌ర్ ఓవ‌ర్ నిర్వ‌హిస్తారు. అది కూడా టై అయితే మ‌ళ్లీ సూప‌ర్ ఓవ‌ర్ ఉంటుంది. ఇలా మ్యాచ్ ఫ‌లితం తేలే వ‌ర‌కు సూప‌ర్ ఓవ‌ర్లు వేయిస్తూనే ఉంటారు. ఇప్పటి వ‌ర‌కు నాకౌట్ ద‌శ‌లో మాత్ర‌మే సూప‌ర్ ఓవ‌ర్లు ఆడిస్తుండ‌గా.. ఇక‌పై లీగ్ దవ‌లో కూడా ఆడించ‌నుంది. జింబాబ్వే - నేపాల్ జట్లపై గతంలో విధించిన నిషేధాన్ని తొలగించింది.

ఇదిలా ఉంటే మ‌హిళా క్రికెట్లో ఇప్ప‌టి వ‌రు ఇస్తోన్న ఫ్రైజ్‌ మ‌నీని సైతం భారీగా పెంచ‌నుంది. టీ-20 వరల్డ్ కప్ పోటీల్లో విజేతకు రూ. 7 కోట్లు - రన్నరప్ కు రూ. 3.5 కోట్లు ఇవ్వనున్నారు. వన్డే ప్రపంచ కప్‌ మొత్తం ప్రైజ్‌ మనీని రూ. 24.8 కోట్లకు పెంచాలని కూడా ఐసీసీ నిర్ణయించింది. ఏదేమైనా సూప‌ర్ ఓవ‌ర్‌ పై ఐసీసీ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసిస్తున్నారు.