Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కవితక్క.. పసుపుబోర్డు గురించి మాట్లాడారు

By:  Tupaki Desk   |   4 May 2022 11:30 AM GMT
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కవితక్క.. పసుపుబోర్డు గురించి మాట్లాడారు
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. కొందరి అంచనా ప్రకారం వచ్చే ఏడాది కర్ణాటకతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు గులాబీ సారు వెళ్లిపోతారన్న ప్రచారం సాగుతోంది. ఎన్నికల సంగతి ఎలా ఉన్నా.. దానితో సంబంధం లేని విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు రాజకీయం మహా హీటెక్కించింది. ఓవైపు మండే ఎండలు.. మరోవైపు రాజకీయం గరంగరంగా మారింది. ఓవైపు పాదయాత్రలు.. మరోవైపు అగ్ర నాయకత్వాలు తెలంగాణలో పర్యటిస్తూ.. ఒకరిపై మరొకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు.

మరేమైందో కానీ.. మూడేళ్ల నుంచి పెద్దగా మాట్లాడని పసుపు బోర్డు ప్రస్తావనను తీసుకొచ్చారు ఎమ్మెల్సీ కవిత. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె.. పసుపు బోర్డు సాధనలో విఫలమయ్యారన్న గుర్రు.. అదే సమయంలో తనను గెలిపిస్తే.. పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్లు పట్టుకొని మరీ ప్రచారం చేసిన ధర్మపురి అర్వింద్ ను నమ్మిన నియోజకవర్గ ప్రజలు ఆయనకు సంచలన విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే.

అయితే.. పసుపు బోర్డు ఏర్పాటులో తలెత్తిన సమస్యలతో పాటు.. మోడీ సర్కారు సుముఖంగా లేకపోవటంతో ధర్మపురి అర్వింద్ ఎంత ప్రయత్నించినా అది హామీ అమలు కాలేదు. దానికి బదులుగా స్పైస్ బోర్డు ను తెచ్చినట్లుగా చెప్పినప్పటికీ.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న పెదవి విరుపు మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి.. ఇలాంటి పరిస్థితి కవితకు కలిసి వచ్చేదే. ప్రత్యర్థికి చెమటలు పట్టించేందుకు వీలుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చి.. గెలిచిన వెంటనే బోర్డు తెస్తానని బీరాలు పలికి.. ఇంతకాలం ఎందుకు తేలేదని.. ఏడాది తర్వాత నుంచే ప్రశ్నించొచ్చు.

కానీ.. ఆమె మాత్రం అలా చేయలేదనే చెప్పాలి. చాలా తక్కువ సందర్భాల్లో ప్రస్తావించి ఊరుకున్నారే కానీ.. దీన్నో ఇష్యూగా టేకప్ చేసింది లేదు. అలాంటి కవిత.. తాజాగా మాత్రం ఆమె ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పెద్ద ప్రెస్ మీట్ పెట్టేశారు. మూడేళ్లుగా పసుపు బోర్డు తెస్తారని చూశామని.. కానీ తేలేదన్న ఆమె.. హైస్పీడ్ లో అబద్ధాలు చెప్పటం మినహా బీజేపీ నేతలు చేసిందేమీ లేదని మండిపడ్డారు. మూడేళ్ల క్రితం పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చారని.. అర్వింద్ కు ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉందన్నారు. పసుపు బోర్డు ఎప్పుడు తెస్తారని ప్రశ్నించారు.

"పసుపు బోర్డు విషయంపై ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. సుపుకు మద్దతు ధర ఇస్తామని ఎంపీ చెప్పారు. ఆ విషయం ఏమైంది? ఈ మూడేళ్లలో ఎంపీ అర్వింద్ పార్లమెంటులో ఐదుసార్లు మాట్లాడారు. ఆ సమయంలోనూ పసుపు బోర్డు గురించి మాట్లాడలేదు. మద్దతు ధర ఇవ్వమని అడగలేదు. పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి అర్వింద్. ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు ఆడి పొద్దు గడుపుతారు? ఎర్రజొన్నకు మద్దతు ధర ఇస్తామన్నారు. అదేమైంది? ఇచ్చిన హామీల గురించి ప్రయత్నాలు చేస్తారేమోనని మూడేళ్లు విడిచిపెట్టాం. ఇక.. విడిచిపెట్టేది లేదు. మీరు ఢిల్లీలో మోకాళ్ల యాత్ర చేస్తారో.. మీ ఢిల్లీ నాయకుల వద్ద మోకరిల్లి పసుపు బోర్డు సాధించుకు వస్తారో.. ఏం చేస్తారో చేయండి. బాండ్ పేపర్ లో చెప్పినట్లుగా పసుపు బోర్డును పట్టుకుు రండి. లేకుంటే ఏ గ్రామానికి పోయినా అడుగడుగునా నిలదీస్తాం" అంటూ మండిపడ్డారు.

ఇన్ని మాట్లాడిన కవితక్క మరో విషయానికి మాత్రం సమాధానం చెప్పాల్సిందే. ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డును అత్యధిక ప్రాధమ్య అంశంగా చెప్పిన బీజేపీ నేతల్ని మూడేళ్లు ఎందుకు వదిలి పెట్టినట్లు? ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నట్లు? ఇన్నాళ్లు వదిలేసిన అంశాన్ని కవిత ఈ రోజున ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు? అన్న దానికి సమాధానం చెప్పాల్సి ఉందని చెప్పక తప్పదు.