Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కేబినెట్‌లో చంద్ర‌బాబు ఉన్నారా? మంత్రి సురేష్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   19 April 2022 11:30 AM GMT
జ‌గ‌న్ కేబినెట్‌లో చంద్ర‌బాబు ఉన్నారా?  మంత్రి సురేష్ కామెంట్స్‌
X
ఏపీలోని జ‌గ‌న్ కేబినెట్ 2.0లో మళ్లీ అవ‌కాశం ద‌క్కించుకున్న మంత్రి ఆదిమూల‌పు సురేష్.. తాజాగా సం చల‌న వ్యాఖ్య‌లు చేశారు. అటు టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఇటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌పై ఆయ‌న ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. జ‌గ‌న్ కేబినెట్‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉన్నారా? అని ప్ర‌శ్నించారు.

జ‌న‌సేన అధినేత జెండా.. అజెండా .. అన్నీ కూడా ప‌ల్ల‌కీ మోయ‌డ‌మేన‌ని చెప్పారు. ఇక‌, వైసీపీలో ఉన్న వారంతా జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన వారేనని తాజాగా మాజీ మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆదిమూల‌పు స‌మ‌ర్ధించారు.

క్యాబినెట్ మొత్తాన్ని మారుస్తామని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదని మొత్తం క్యాబినెట్ మారుస్తారని సీఎం జగన్ చెప్పినట్టుగా చంద్రబాబు చెబుతున్నారని, జగన్ చెప్పని విషయం చంద్రబాబుకు ఎలా తెలుసు అంటూ సురేష్ ప్రశ్నించారు. చంద్రబాబు ఏమైనా జ‌గ‌న్‌ క్యాబినెట్ లో ఉన్నారా అని ప్ర‌శ్నించారు. చంద్రబాబులో అభద్రతాభావం పెరిగిందని మంత్రి మండిపడ్డారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పైనా సురేష్ విరుచుకుప‌డ్డారు.

పవన్ కు ఒక జెండా, అజెండా రెండు లేవని విమర్శించారు. ఎవరో ఒకరి పల్లకీ మోయడమే పవన్ కళ్యాణ్ అజెండా అంటూ విమ‌ర్శించారు. అందుకే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా వాటన్నింటినీ గంపగుత్తగా వేరే వారికి అప్పగిస్తామని సిద్ధాంత ధోరణి అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. ఇక దీనిని ఎవరైనా పార్టీ సిద్ధాంతం అంటారా అని నిల‌దీశారు. తాజాగా ఏర్ప‌డిన జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో శాఖల మార్పులు ఉంటా యన్న ప్ర‌చారంపై స్పందిస్తూ.. అలాంటి దేమీ త‌న‌కు తెలియ‌ద‌న్నారు. తనకు అప్పగించిన మున్సిపల్ శాఖ బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు.

విద్యా శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారని, ప్రస్తుతం ఆయ‌న పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉన్నార‌ని సురేష్ తెలిపారు. ప్ర‌కాశం జిల్లాకు చెందిన‌ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పని చేస్తానని వెల్లడించారు. బాలినేనితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. మంత్రి పదవుల విషయం స్వయంగా జగన్ చూసుకున్నారని, బాలినేనికి పార్టీ పదవిని కేటాయిస్తారని తెలిపారు.

మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల ఆదరణ మాత్రం తమకు ఎప్పటికీ ఉంటుందని ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాత మంత్రివర్గంలో తామంతా రాజీనామా చేసిన తర్వాత అవసరం అనుకున్న చోటే మళ్లీ మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించారని ఆదిమూలపు తెలిపారు. అంతే తప్ప తనకు మంత్రిగా అవకాశం ఇవ్వడంలో ఇతర కారణాలేవీ లేవు అని వెల్లడించారు.