Begin typing your search above and press return to search.

రాహుల్ దూకుడు వెనుక ఆ హీరోయిన్ ఉందంట‌

By:  Tupaki Desk   |   5 Nov 2017 6:32 AM GMT
రాహుల్ దూకుడు వెనుక ఆ హీరోయిన్ ఉందంట‌
X
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోషల్‌మీడియాలో దూసుకుపోతూ రాజకీయాలపై పట్టు బిగించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఆ దిశగా దృష్టి సారించి ఇటీవ‌ల మెరుగైన ఫ‌లితాలు సాధించ‌డం వెనుక ఓ సినీ న‌టి ఉన్న‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ ఆన్‌లైన్ బ్రాండ్ ఇమేజీ పెంచాలన్న పట్టుదలతో ఉన్న పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీ సోషల్ మీడియా విభాగం నిర్వహణకు కన్నడ సినీనటి, మాజీ ఎంపీ రమ్యను ఎంపిక చేశారు.

డిజిటల్ కమ్యూనికేషన్స్ విభాగం అధిపతిగా ఆమె సోషల్ మీడియాతో పాటుగా ఐటీ వ్యవహారాలను చూస్తున్నారు. దీంతో మెరుగైన ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు అంటున్నాయి. సోషల్ మీడియాలో ఆఫీస్ ఆఫ్ రాహుల్ గాంధీ, ఐఎన్‌సీ ఇండియాకు ఫోలోవర్స్ పెరగడం వెనక హీరోయిన్ రమ్య హస్తమే ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగాన్ని స్థాపించి ఐదేళ్ల‌పాటు నిర్వహించిన దీపిందర్ హూడా గణనీయమైన ఫలితాలు సాధించలేకపోయారు. దీంతో మ‌రింత ముందుకు తీసుకుపోవ‌డంలో భాగంగా ర‌మ్య‌కు ప‌గ్గాలు అప్ప‌గించారు. త‌న‌దైన శైలిలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించే ర‌మ్య‌కు సోష‌ల్ మీడియా ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ద్వారా ఆన్‌లైన్ ప్ర‌చారంలో అగ్ర‌స్థానానికి చేరుకోవ‌చ్చున‌ని కాంగ్రెస్ భావించింది. రాహుల్‌కు స‌న్నిహితురాలేనే పేరున్న ర‌మ్య కొత్త ప‌గ్గాలు స్వీక‌రించిన అనంత‌రం కాంగ్రెస్ డిజిటల్ మీడియా విభాగాన్ని కొత్త పుంత‌లు తొక్కించారు. రమ్య సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టకముందు డిజిటల్ వార్ రూమ్‌లో కేవలం ముగ్గురే అమ్మాయిలు పనిచేసేవారు. రమ్య వచ్చాక ఆఫీస్ మొత్తం స్టాఫ్‌లో 85 శాతం మహిళా ఉద్యోగులే ఉన్నారు. కాగా మాజీ ఎంపీ, ప్ర‌ముఖ న‌టి అయిన ర‌మ్య‌కు ట్విట్టర్‌లో దాదాపు 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ర‌మ్య అసలు పేరు.. దివ్య స్పందన. కన్నడ, తెలుగు, మళయాలం, తమిళ సినిమాల్లో నటించిన ర‌మ్య 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తరువాత కర్ణాకటలోని మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. త‌న‌దైన శైలిలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించే ర‌మ్య కాంగ్రెస్ అధిష్టానానికి త‌క్కువ స‌మ‌యంలోనే చేరువ అయ్యారు. రాహుల్ స‌న్నిహితురాలిగా ముద్ర‌ప‌డ్డారు. అనంత‌రం ఆమెకు డిజిట‌ల్ మీడియా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌గా...స్వ‌ల్ప‌కాలంలోనే మెరుగైన ఫ‌లితాలు చూపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జాద‌ర‌ణ పెంచ‌డం, రాహుల్ ట్వీట్ల‌లో కంటెంట్ మెరుగుప‌డేలా డాటా అందిచ‌డం వంటివ‌న్నీ ర‌మ్య నిర్వ‌హించారు. 2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న ర‌మ్య ఈ దారిలో జోరుగా ముందుకు సాగుతున్నారు.

కాగా, కొద్దికాలం క్రితం రమ్య వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్‌కు వెళ్లిన రమ్య అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొని ఇండియాకు వచ్చిన అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్‌లో పరిస్థితులు బాగున్నాయని, అది చాలా మంచి దేశమని మెచ్చుకున్నారు. పాకిస్తాన్‌కు వెళితే నరకానికి వెళ్లినట్లు ఉంటుందని అప్ప‌టి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్ప‌డం సరికాదని ఖండించారు. ఇండియాలో ప్రజలు ఎలా నివసిస్తున్నారో, పాక్‌లో కూడా అలాగే ప్రజలు ఉన్నారని, అది చాలా మంచి దేశమని అన్నారు. పాక్ వెళ్లిన వారిని బాగా చూసుకుంటారని కూడా వ్యాఖ్యానించారు. రమ్య వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సంస్థలు తీవ్ర నిరససలు తెలిపాయి.