Begin typing your search above and press return to search.

సవాళ్ల పర్వంలో.. పీక్స్ కు చేరేలా అచ్చెన్న తాజా సవాల్

By:  Tupaki Desk   |   12 April 2021 4:36 AM GMT
సవాళ్ల పర్వంలో.. పీక్స్ కు చేరేలా అచ్చెన్న తాజా సవాల్
X
ఇప్పటికే పొలిటికల్ హీట్ రగిల్చిన తిరుపతి ఉప ఎన్నిక.. రోజులు గడిచే కొద్దీ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ లేని రీతిలో సవాళ్ల మీద సవాళ్లు తెర మీదకు వస్తున్నాయి. అధికార.. విపక్షాలు సంధిస్తున్నసవాళ్లకు ఎదుటివారు స్పందించకుండా.. తమదైన సవాళ్లను విసరటం వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. ఈ సవాళ్లను షురూ చేసింది చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి లోకేషే. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. వైఎస్ వివేకను తమ కుటుంబం హత్య చేయలేదని తాము వేంకటేశ్వరస్వామి మీద ప్రమాణం చేసి చెబుతామని.. మరి జగన్ వచ్చి అదే వెంకన్న స్వామిపై తమ కుటుంబానికి ఆ హత్యతో సంబంధం లేదని ప్రమాణం చేయగలరా? అని సవాలు విసిరారు.

తిరుపతి ప్రచారానికి వచ్చే.. జగన్ తాను విసిరిన సవాల్ కు సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు. ఈ సవాలుపై ఇప్పటివరకు వైసీపీ నేతలు ఎవరూ నేరుగా స్పందించింది లేదు. అదే సమయంలో సీఎం జగన్ టూర్ రద్దు అయ్యింది. దీంతో.. టీడీపీ నేతలు తమ విమర్శల్ని మరింత పెంచారు. ఇలాంటివేళ స్పందించిన విజయసాయి మాత్రం.. లోకేష్ సవాళ్లకు స్పందిస్తారా? అంటే ఎటకారం చేసి.. ఇష్యూనుసైడ్ ట్రాక్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో.. లోకేష్ విసిరిన సవాల్ ను తెలుగు తమ్ముళ్లు అదే పనిగా ప్రస్తావిస్తుండటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. సవాళ్ల పర్వంలో తమది పైచేయి కావటం కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు. ఉప ఎన్నికను వైసీపీ రెఫరెండంగా చూస్తుందని.. ఇందులో వైసీపీ ఓడితే.. తమకున్న ఎంపీలమంతా రాజీనామా చేస్తామని.. అదే టీడీపీ కానీ ఓడితే.. వారికున్న ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తారా? అని సవాలు విసిరారు. దీంతో.. వాతావరణం మరింత వేడెక్కింది. ఇలాంటివేళ.. పెద్దిరెడ్డి సవాలుకు ఏపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్న మరో భారీ సవాలుకు దిగారు.

నారా లోకేష్ విసిరిన సవాలుకు సమాధానం చెప్పలేక సీఎం జగన్ తన తిరుపతి టూర్ నురద్దు చేసుకున్నారని అచ్చెన్న ఆరోపించారు. అంతేకాదు.. సొంత బాబాయ్ హత్య కేసును పరిష్కరించలేని జగన్.. ఏపీలోని సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి తిరుపతి ఉప ఎన్నికను జగన్ పాలనకు రిఫరెండం అంటున్న వైసీపీ నేతలకు అచ్చెన్న మరో భారీ సవాలు విసిరారు.

ఏపీలో ప్రస్తుతం ఉన్నఅసెంబ్లీని రద్దుచేసి.. జగన్ పాలన మీద రెఫరెండంగా ఎన్నికలకు వెళదామని.. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే.. పార్టీని మూసివేస్తామని ఆయన సవాలువిసిరారు. ఈ సవాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి.. దీనికి వైసీపీ నేతలు ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రచారంలో ఈ సవాళ్ల పర్వం వేడెక్కేలా చేస్తోంది. రానున్న రోజుల్లో ఇదెంత వరకు వెళుతుందో?