Begin typing your search above and press return to search.

అచ్చెన్నాయుడు లోకేశ్ గురించి నిజం చెప్పాడా..?

By:  Tupaki Desk   |   14 April 2021 8:42 AM GMT
అచ్చెన్నాయుడు లోకేశ్ గురించి నిజం చెప్పాడా..?
X
ఒక్క ఓటమి టీడీపీని అథోగతి పాలు చేస్తోందా? 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి టీడీపీ శ్రేణులు కోలుకోవడం లేదా? చంద్రబాబు వృద్ధాప్యం.. లోకేష్ సామర్థ్యం మీద టీడీపీ నేతలకు నమ్మకం సడలుతోందా? జగన్ ను ఎదుర్కొనే దమ్ము టీడీపీకి లేదని భావిస్తున్నారా? తాజాగా అచ్చెన్నాయుడి వీడియో పేరిట లీకైన పదాలు చూస్తే అదే అర్థమవుతోందన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.

వరుస దెబ్బలతో ఏపీ టీడీపీ కుదేలవుతోంది. పార్టీ నాయకుల్లో కూడా నైరాశ్యం అలుముకుంటోంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాని ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. అయితే ఈ తరుణంతో పక్కవాళ్ల జోలికేందుకని సొంత పార్టీలో కొందరు నాయకులు పార్టీ అధినేతలపై రకరకాలుగా అనుకుంటున్నారట. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నట్టుగా బయటకు వచ్చిన కొన్ని వీడియోల్లోని వ్యాఖ్యలకు పార్టీలోని సీనియర్ నాయకులు జై కొడుతున్నారట. చాలా బాగా చెప్పావ్ అచ్చెన్నా అని సంబరపడుతున్నారట. అయితే అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేసింది అధికార పార్టీ మీద కాదు.. సొంతపార్టీ అధినేతపైనే.. ఆ వ్యాఖ్యలేంటో చూద్దాం.

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్టింగ్ ఆపరేషన్ లో లోకేశ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారని వీడియోలో వినిపిస్తోంది. వీటిపై సీనియర్ నాయకులు సంబరపడిపోతున్నారట. మేము అనాల్సిన మాటలు అచ్చెన్నాయుడు అన్నాడని.. మా మనసులో కూడా ఇదే ఉందని అనుకుంటున్నారట. 2014లో టీడీపీ గెలిచిన తరువాత అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ప్రతీ విషయానికి లోకేశ్ ను కలవమని సూచించాడట. అయితే కాంగ్రెస్ లో, ఇతర పార్టీల్లో కాకలు తీరిన నాయకులు లోకేశ్ దగ్గర చేతులు కట్టుకోవాలా..? అని అనుకునేవారట.

అంతేకాకుండా ఆ సమయంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు వద్దని కొందరు సీనియర్ నాయకులు, మంత్రులు చెప్పారట. అయితే లోకేశ్ మాత్రం మాట వినకుండా వారిని చేర్చుకున్నారట. ఆ తరువాత వైసీపీ పని అయిపోయింది అని కొన్ని టీడీపీకి చెందిన ఛానెళ్లలో ప్రచారం చేయించాడట. దీంతో అప్పటి సీనియర్ నాయకులు, మంత్రుల అసహనం వ్యక్తం చేశారట.

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపి గెలుపుకు సెంటిమెంట్ కారణం కాదని, చంద్రబాబు, లోకేశ్ చేసిన కొన్ని తప్పులేనని సీనియర్ నాయకులు అనుకుంటున్నారు. ఇటీవల వరుస పరాజయాలకు కారణం వారిద్దరేనని లోలోపల అనుకంటున్నారట. అయితే ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డైరెక్ట్ గా చెప్పకపోయినా లోకేశ్ ను ఉద్దేశించే ‘ఇప్పుడు కూడా సరిదిద్దుదకోకపోతే పార్టీ పని అంతే’అని వ్యాఖ్యలు చేశారని సీనియర్ నాయకులు అనుకుంటున్నారట. అయితే మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కూడా చంద్రబాబు, లోకేశ్ లు తమ తీరును కొంత మార్చుకోకపోతే రాను రాను పార్టీ బతకదని అనుకుంటున్నారట.