Begin typing your search above and press return to search.

ఉత్తర ఆంధ్రాలో అచ్చెన్నాయుడు పూర్తిగా ఒంటరయ్యారా?

By:  Tupaki Desk   |   29 April 2021 3:30 PM GMT
ఉత్తర ఆంధ్రాలో అచ్చెన్నాయుడు పూర్తిగా ఒంటరయ్యారా?
X
టీడీపీ ఏపీ అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు ఇప్పుడు ఉత్తర ఆంధ్రాలో పూర్తిగా ఒంటరి అయినట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు వ్యతిరేకంగా ఇటీవల ఓ వీడియోలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించిన తర్వాత పార్టీలో సమీకరణాలు మారాయంటున్నారు. టిడిపి భవిష్యత్తు గురించి ఆయన చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. అచ్చెన్న మాటలకు ముందు ఆయన ఉత్తర ఆంధ్రాలో బలమైన నేతగా.. అందరి మద్దతున్న నేతగా ఉండేవారు. కానీ ఆ వీడియో బయటపడ్డాక పెద్దగా పార్టీలో అచ్చెన్నాయుడికి మద్దతు దక్కడం లేదని టాక్.

ఉత్తర ఆంధ్ర నుంచి వచ్చిన నాయకులు గౌతు శ్యామసుందర్ శివాజీ.. కిమిడి కళా వెంకట్ రావు లు ఇప్పుడు అచ్చెన్నాయుడకు వ్యతిరేకంగా తయారయ్యారని అంటున్నారు. వాస్తవానికి అచ్చెన్నాయుడు స్థానంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకటరావు ఉండేవారని.. కానీ లక్ కలిసి వచ్చి అచ్చెన్న అయిపోయాడని అంటున్నారు. మాజీ మంత్రి గుండా అప్పల నారాయణ స్వామి కూడా ఇప్పుడు టీడీపీని వీడే సందిగ్ధంగా ఉన్నారు. అయితే ఆయనకు పార్టీ పట్ల ఉన్న విధేయత అచ్చెన్నపై అభిమానంతో కాదని అంటున్నారు. సంక్షోభ సమయాల్లో ఆయన అచ్చెన్నాయుడు కంటే పార్టీతో కలిసి నిలబడతారని చెబుతున్నారు.

విజయనగరంలో గజపతి రాజ వంశానికి చెందిన అశోక్ గజపతి రాజు కూడా అచ్చెన్నను దూరం పెడుతున్నారు. తన ప్రత్యర్థులను అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తున్నాడని అశోక్ గజపతి గుర్రుగా ఉన్నాడు. విశాఖ జిల్లాలో సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రస్తుతం పార్టీకే దూరంగా ఉంటున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో అతని తదుపరి దశ ఏమిటనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

అచ్చెన్నాయుడు తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న మరో సీనియర్ నాయకుడు అయ్యన్న పత్రుడు. పార్టీ కోసం ఎంతో త్యాగం చేసి సహకరిస్తున్న నాయకుడు అతడు. కానీ తనను విస్మరించాడని అయ్యన్న పట్లగా వ్యతిరేకంగా ఉన్నాడు. అచ్చెన్నను ఏపీ టీడీపీ చీఫ్‌గా చేసినప్పటి నుంచీ అయ్యన్న బాధపడుతున్నారట.. అందుకే ఇప్పుడు అచ్చెన్నాయుడు వీడియోలో బుక్ అయిన వేళ అయ్యన్న ఆయనను దూరం ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతానికి అచ్చెన్నాయుడు తన ఉత్తర ఆంధ్రాలోని నాలుగు జిల్లాలో దాదాపు ఒంటరి అయ్యాడని.. ఆయనకు నేతలంతా మద్దతు ఇవ్వడం లేదని.. పార్టీ కూడా దూరం పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.

అయితే అటు పార్టీ అధిష్టానం పట్టించుకోక.. ఇటు పార్టీలోని నేతలు పట్టించుకోకపోవడంతో అచ్చెన్నాయుడు ఇప్పుడు సమస్యలపై గళమెత్తుతూ తాను టీడీపీలోనే ఉంటానని.. యాక్టివ్ రోల్ పోషిస్తానని తన చర్యల ద్వారా చాటిచెబుతున్నాడు.

తాజాగా ఏపీ సచివాలయంలో మరో ఉద్యోగి కరోనాతో మృతిచెందడంతో ఉద్యోగుల పక్షాన అచ్చెన్నాయుడు గళమెత్తారు. తాజా పరిస్థితుల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంభించాలని.. వారి ప్రాణాలను కరోనానుంచి రక్షించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అచ్చెన్నాయుడు డిమాండ్ చేస్తున్నారు. అలా పార్టీలో తన పరపతిని పెంచుకునేందుకు.. డ్యామేజ్ కంట్రోల్ కోసం అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.