Begin typing your search above and press return to search.

నన్ను కొడితే.. రాహుల్.. కేజ్రీలు మాట్లాడలేదే?

By:  Tupaki Desk   |   22 Jan 2016 4:59 AM GMT
నన్ను కొడితే.. రాహుల్.. కేజ్రీలు మాట్లాడలేదే?
X
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వివాదంలో కీలకమైన ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తన వాదనను వినిపించారు. అసలేం జరిగిందన్న విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. భావస్వేచ్ఛ గురించి ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలుకొని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరకూ ఏమయ్యారని సూటిగా ప్రశ్నించారు.

తన రూంకి వచ్చి 30 మంది లాగి లాగి కొట్టి.. బలవంతంగా క్షమాపణలు చెప్పించారని.. ఈ విషయంపై తధాసేన్ గుప్తా అనే టీచర్స్ అసోసియేషన్ కు చెందిన వ్యక్తి ఫేస్ బుక్ లో ఎలా పోస్టింగ్ చేస్తారని? ప్రశ్నించారు. ఇది జరిగిన సమయంలో తాను ఆసుపత్రిలో ఉన్నానని.. తనపై దాడి చేసిన అంశాన్ని కృష్ణ చైతన్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడని.. విచారణ అధికారులు అతన్ని ప్రశ్నించే క్రమంలో తనపై జరిగిన దాడిని ప్రత్యక్షంగా చూశారా? అని ప్రశ్నిస్తే లేదని చెప్పటం జరిగిందన్నారు. దీంతో తనపై దాడి జరగలేదని తేల్చారని వాపోయాడు. ఇది తెలుసుకొని మరో వ్యక్తి ముందుకు వచ్చి నాపై జరిగిన దాడిని చూశానని.. సాక్ష్యం ఇస్తానని ముందుకు వచ్చారని.. విచారణ అధికారుల ముందు సాక్ష్యం చెప్పటంతో విద్యార్థులపై ఆర్నెల్లు సస్పెన్షన్ విధిస్తూ వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్న విషయాన్ని సుశీల్ వెల్లడించారు.

తనపై దాడి చేసిన ఉదంతానికి సంబంధించి ఆధారాలు.. సాక్ష్యాలు ఉన్నాయని.. తన ఒక్కరి మీదనే కాదు.. తనపై దాడి జరిగిన పది రోజులకు మరో దళిత విద్యార్థిని.. ఎస్ ఎఫ్ ఐ విద్యార్థితో పాటు.. పలువురు విద్యార్థుల్ని కొట్టటం జరిగిందన్నాడు. తనపై దాడి జరిగిన ఉదంతంపై తన తల్లి వీసీ ఛాంబర్ కు వెళ్లి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తే.. వీసీ ఛాంబర్ లోనే అవమానించారని.. కావాలంటే సీసీ కెమేరా ఫుటేజ్ పరిశీలించాలని కోరారు. తన తల్లికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావటంతో ఆమె హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘మా అమ్మకు వీసీ ఛాంబర్ లోనే అవమానం జరిగింది. దానికి ఇప్పటివరకూ ఎవరూ మాట్లాడింది లేదు’’ అంటూ వాపోయాడు.

సోషల్ బాయ్ కాట్ అని మాట్లాడుతున్నారని.. కేవలం ఆర్నెల్లు అకడమిక్ సస్పెన్షన్ తప్పించి మరింకేమీ జరగలేదని.. కానీ.. లేనిపోని మాటలు చెప్పి విష ప్రచారం చేస్తున్నారని సుశీల్ ఆరోపించారు. తాము బీజేపీని సంప్రదించినట్లుగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.. మేం ప్రభుత్వాన్ని అభ్యర్థించామని.. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం లేకుండా యూపీఏ ప్రభుత్వం ఉన్నా.. తాము అదే పని చేసేవాళ్లమని సుశీల్ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ రాసిన లేఖలో యాంటీ నేషనల్ యాక్టివిటీ జరిగిందనే పేర్కొన్నారు తప్పించి.. ఏ విద్యార్థి పేరును ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నది లేదని గుర్తు చేశారు.

ఇప్పటివరకూ తన కులం గురించి చెప్పలేదని.. తాను ఓబీసీ కులానికి చెందిన వ్యక్తినని.. ఒక ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి భావస్వేచ్ఛను హరించినప్పుడు రాహుల్ గాంధీ.. కేజ్రీవాల్.. సీతారాం ఏచూరి ఎక్కడికి వెళ్లారు? నన్ను ఒక్కడ్ని చేసి కొట్టినప్పుడు వీరెందుకు మాట్లాడలేదు? అంటూ ప్రశ్నించారు.