Begin typing your search above and press return to search.

సీపీఎస్ రద్దు... వైసీపీ ముందు అతి పెద్ద ప్రశ్న...?

By:  Tupaki Desk   |   21 Nov 2022 9:33 AM GMT
సీపీఎస్ రద్దు... వైసీపీ ముందు అతి పెద్ద ప్రశ్న...?
X
అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు రాజకీయ పార్టీలు ఇవ్వడం పరిపాటి. అయితే వచ్చిన తరువాత వాటిని తుచ తప్పకుండా అమలు చేయడంలో బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంతవరకూ చేయలేదనే అనుకోవాలి. ఏపీలో 99 శాతం హామీలను నెరవేర్చామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ కూడా నెరవేర్చని అతి పెద్ద హామీగా సీపీఎస్ రద్దు ఉంది. పాదయాత్ర సమయాన జగన్ ఆర్భాటంగా ఇచ్చిన ఈ హామీ మూడున్నరేళ్లు గడచినా దిక్కూ దివాణం లేకుండా అలా మూలన పడి ఉంది.

ఏపీలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన అతి ముఖ్యమైన హామీని ఇలా కాలంతో పాటుగా దూకుడుగా నెట్టుకుంటూ వైసీపీ ముందుకు సాగుతోంది. అదే టైంలో సీపీఎస్ రద్దు తప్ప తమకు వేరేది లేదంటూ ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు గట్టిగానే నిలబడుతున్నారు.

ప్రభుత్వం ఏమరపర్చినా కేసులు పెట్టి అణచాలనుకున్నా లేక మరో విధమైన హామీలు ఇచ్చినా కూడా తాము తగ్గేది లేదని వారు ఖండితంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే సీపీఎస్ రద్దు అన్నది ఎంత బలంగా ప్రభుత్వ ఉద్యోగులలో ఉందో చెప్పడానికి తాజాగా జరిగిన ఒక ఉదంతం చెప్పాలి. సీపీఎస్ విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాన్ని తట్టుకోలేక ఉద్యోగులు ఆత్మహత్యలతో నిరసనలు తెలపాలనుకుంటున్నారు. దాంతో నంద్యాల జిల్లాకు చెందిన ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీపీఎస్ రద్దు కోసం ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి నిద్రమాత్రలు మింగాడు. ఇది నిజంగా సంచలనం రేపే విషయం అయింది.

చివరికి ఈ వ్యవహారం కాస్తా ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాల ఆవేశానికి కారణం అయింది. ఇక లాభం లేదు, జగన్ సర్కార్ తో తేల్చుకోవాల్సిందే అని ఉద్యోగులు డిసైడ్ అయ్యారని అంటున్నారు. తొందరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణను వారు రెడీ చేస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే నిజంగా సీపీఎస్ రద్దు అన్నది ప్రభుత్వానికి భారమా లేక అంత అసాధ్యమైన హామీయా అంటే అదేమీ లేదు అన్నట్లుగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు నిరూపించాయి.

దేశంలో ఇప్పటికి అయిదు రాష్ట్రాలు సీపీఎస్ రద్దుని చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆప్ సీపీఎస్ ని రద్దు చేసి పారేసింది. గుజరాత్ ఎన్నికల మ్యానిఫేస్టోలో కూడా ఈ హామీ ఇచ్చింది. ఇక రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఎస్ ని రద్దు చేసింది. ఇలా దేశంలో చాలా రాష్ట్రాలు సీపీఎస్ ని రద్దు చేస్తూంటే ఏపీలో మాత్రం ఇచ్చిన హామీని అమలు చేయకుండా తాత్సారం చేయడం పట్ల ఉద్యోగ వర్గాలు మండిపోతున్నాయి.

ఇదే తీరున ప్రభుత్వం వ్యవహరిస్తే తాము చేయాల్సింది చేస్తామని అంటున్నారు. అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు అని చెప్పిన వైసీపీకి మూడున్నరేళ్ళు పాలన పూర్తి అయినా ఆ వారం మాత్రం ఇంకా రాలేదా అని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. తాము తలచుకుంటే ప్రభుత్వాలే మారుతాయని ఇప్పటికే ఉద్యోగ వర్గాలు చెప్పిన నేపధ్యంలో అది ఒక కఠిన హెచ్చరికగానే వైసీపీ ప్రభుత్వానికి ఉంటుందని అంటున్నారు మేము అవగాహన లేక హామీ ఇచ్చామని తప్పించు కోవాలని చూసిన ఇపుడు కుదిరే వ్యవహారం కాదు.

ఇదే విషయం వైసీపీలోనూ చర్చగా ఉంది. మరో ఏణ్ణర్ధం పైగా అధికారం చేతిలో ఉన్న వైసీపీ సీపీఎస్ రద్దు విషయంలో సరైన నిర్ణయం తీసుకుని ఉద్యోగ వర్గాలను శాంతపరచకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో వారే ఎదురుతిరుగుతారు అని అంటున్నారు.

లక్షలాది మంది ఉద్యోగులతో ప్రభుత్వం పెట్టుకుంటే అది ఎలాంటి ఫలితం ఇస్తుందో వైసీపీ పెద్దల కంటే బహుశా ఎవరికీ తెలియదేమో. మొత్తానికి చూస్తే వైసీపీకి సీపీఎస్ రద్దు కళ్ళ ముందు కనిపించే అతి పెద్ద ప్రశ్నగా ఉంది అంటున్నారు. మరి రద్దు చేస్తారా లేక అణచివేత విధానాలతో ముందుకు సాగుతారా. చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.