Begin typing your search above and press return to search.

బాలాకోట్ హీరోకు పదోన్నతి

By:  Tupaki Desk   |   4 Nov 2021 4:02 PM GMT
బాలాకోట్ హీరోకు పదోన్నతి
X
భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు సైన్యంలో పదోన్నతి కల్పించింది భారత ప్రభుత్వం. ఒకానొక సమయంలో భారతదేశం అంతటా ఈ పేరు మార్మోగిపోయిన ఈ బాలాకోట్ దాడుల హీరోకు భారత వాయుసేనలో గ్రూప్ కెప్టన్ ర్యాంకు దక్కనుంది. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను భారతీయ వైమానిక దళం జారీ చేసింది. ఈ ర్యాంకు అనేది వాయుసేనలో కల్నల్ ర్యాంకుకు సమానంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దాయాది దేశమైన పాకిస్థాన్ కు బాలాకోట్ దాడుల సమయంలో అభినందన్ గట్టిగానే బుద్ధి చెప్పారు. ఆ దేశానికి చెందిన ఎఫ్-16 అనే యుద్ధ విమానంను అభినందన్ కూల్చివేశారు. 2019లో జరిగిన ఈ ఘటనలో భారత్ పై దాడికి యత్నించిన పాక్ కు గగనతలంలోనే విరోచితంగా పోరాడారు.

చివరికి ఎఫ్-16ను కూల్చివేశారు. ఈ క్రమంలోనే ఆయన నడుపుతున్న మిగ్-21 విమానం కూడా కూలిపోయింది. ఆసమయంలోనూ ధైర్యాన్ని కోల్పోని ఆయన పారాచూట్ తో నేలకు చేరారు. అయితే దిగిన ప్రదేశం పాకిస్థాన్ ఆక్రమితం కశ్మీర్ లో ఉండడంతో ఆయనకు కాష్టాలు తప్పలేదు. స్థానికంగా ఉండే పాకిస్థాన్ సైన్యం అభినందన్ ను అరెస్ట్ చేసింది. అంతటితో ఆగకుండా చిత్రహింసలకు గురి చేసింది. అటువంటి సమయంలో కూడా ఆయన భారత సైనిక రహస్యాలను వెల్లడించలేదు. తన దగ్గర పేపర్ పై ఉన్న విలువైన సమాచారాన్ని పాక్ కు చిక్కకుండా ఉండేందుకు వాటిని తన నోటిలోనే పెట్టుకుని నమిలేశారు. దీంతో వారు ఏం చేయలేకపోయారు.

ఈ విషయం తెలుసుకున్న భారత్... పాకిస్థాన్ చెర నుంచి అతడ్ని విడిపించాలని తీవ్రప్రయత్నాలు చేసింది. అంతర్జాతీయ స్థాయిలోనూ ఒత్తిడి పెంచింది. దీంతో చేసేది లేక చివరికి అభినందన్ ను పాక్- భారత సరిహద్దు అయిన వాఘా బార్డర్ లో 2019 మార్చి 1న భారత సైన్యానికి అప్పగించింది పాక్. కొన్ని రోజులు తరువాత అభినందన్ తిరిగి సైన్యంలో చేరారు. ఇంతటి ధైర్యాసాహసాలు ప్రదర్శించిన అభినందన్ కు వీర్ చక్ర అవార్డును ప్రదానం చేసింది కేంద్రప్రభుత్వం. ఈ అవార్డును భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదగా అందుకున్నారు. అయితే తాజాగా ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరికొద్ది రోజుల్లోనే అభినందన్ గ్రూప్ కమాండర్ గా వాయుసేనలో వ్యవహరించనున్నారు.

వింగ్ కామాండర్ అభినందన్ బాలాకోట్ దాడుల్లో సమయంలో చూపిన ధైర్యసాహసాల్ని నేపథ్యాన్ని కథాంశంగా తీసుకొని బాలీవుడ్ లో చిత్రాన్ని నిర్మించాలని నటుడు వివేక్ ఓబెరాయ్ సన్నాహాలు చేశారు. కనీసం మూడు ప్రధాన భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించాలని భావించారు. ఇందుకు సంబంధించిన కథపై పూర్తి హక్కులను సొంతం చేసుకున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. బాలాకోట్ ది ట్రూ స్టోరీ పేరుతో ఒకేసారి హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాలని భావించారు. అభినందన్ వర్ధమాన్ కు పదోన్నతి లభించడంతో ఆ సినిమాపై మరోసారి చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా ఏంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి, భారతదేశ కీర్తి పతాకాన్ని నిలబెట్టిన అభినందన్ వర్ధమాన్ కు కేంద్ర ప్రభుత్వం పదోన్నతి ఇవ్వడంపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.