Begin typing your search above and press return to search.

కన్నకొడుకునే కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన తల్లి..ఎలా ప్లాన్ చేసిందంటే!

By:  Tupaki Desk   |   27 Oct 2020 1:00 PM GMT
కన్నకొడుకునే కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన తల్లి..ఎలా ప్లాన్ చేసిందంటే!
X
ప్రస్తుత సమాజంలో చాలా మంది త్వరగానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే పెళ్లి అయిన కొద్ది కాలానికే విడాకుల పేరిట విడిపోతున్నారు. ప్రస్తుత రోజుల్లో ఇదొక ట్రెండ్ అయిపోయింది. చిన్న చిన్న గొడవలకే విడాకుల వరకు వెళ్లిపోతున్నారు. ఈ తరహా ఘటనే కోయంబత్తూరు లో జరిగింది. భర్త పేరుమోసిన వ్యాపారి కావడంతో ఇష్టం వచ్చినట్టు తిరగడం మొదలుపెట్టింది , వద్దని చెప్పినా భర్త మాట వినలేదు. ఆ తర్వాత విడాకులు ఇచ్చి , భరణంగా రూ.65 లక్షలు, ఓ జ్యువెలరీ షాప్ ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు. కానీ, కరోనా సమయంలో ఆ భరణం ఇవ్వడానికి కొంచెం ఆలస్యం కావడంతో కన్న కొడుకునే తండ్రి నుండి కిడ్నాప్ చేయడానికి కిరాయి గుండాలతో స్కెచ్ వేసింది. కానీ , ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో ప్రస్తుతం పోలిసుల కంట్లో పడకుండా తప్పించుకు తిరుగుతుంది. ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ...

తమిళనాడులోని కోయంబత్తూరులోని ఎదయర్ పాళ్యంలోని తిడయలూర్ లో నాగ గణేష్ కోయంబత్తూరు సిటీ నుంచి తమిళనాడులోని అనేక జిల్లాలకు మందులు, ఔషదాలు హోల్ సేల్ డీలర్ గా, జ్యువెలరీ షాప్ ల యజమానిగా వ్యాపారం చేస్తూ భారీగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. కోయంబత్తూరులో జ్యువెలరీ షాపులు నిర్వహిస్తున్న తిళగరాజన్ కుమార్తె ఐశ్వర్యతో 2013లో నాగ గణేష్ కి పెళ్లి జరిగింది. వివాహం జరిగిన తరువాత నాగ గణేష్, ఐశ్వర్య దంపతులు రెండు సంవత్సరాలు చాలా సంతోషంగా ఉన్నారు. వీరికి రాజేంద్రన్ అనే కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం రాజేంద్రన్ కు 7 సంవత్సరాలు. ఆ తరువాత వారిద్దరి మధ్య వివాదాలు మొదలైయ్యాయి. డబ్బులో పుట్టి , డబ్బులో పెరిగిన ఐశ్వర్య భర్త మాటలు లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగేది. భర్త ఎంత చెప్పినా , నా ఇష్టం అంటూ , తన ప్రవర్తనను మార్చుకోలేదు. గొడవలు ముదిరిపోవడంతో 2016 నుంచి నాగ గణేష్, ఐశ్వర్య దంపతులు వేరువేరుగా ఉంటున్నారు.

ఇక ,విడాకులు తీసుకోవాలని నాగ గణేష్, ఐశ్వర్య దంపతులు కోయంబత్తూరు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. 2019లో దంపతులు విడిపోవడానికి ఓ డీల్ కుదిరింది. తనకు విడాకులు ఇస్తే ఐశ్వర్యకు రూ. 65 లక్షల నగదు, ఒక జ్యువెలరీ షాప్ ఇచ్చేస్తానని నాగ గణేష్ అంగీకరించాడు. ఐశ్వర్య అందుకు ఒప్పుకుంది. ఐశ్వర్య, నాగ గణేష్ న్యాయవాదుల సమక్షంలో ఒప్పందం కుదిరింది. కొడుకు రాజేంద్రన్ తండ్రి నాగ గణేష్ దగ్గర ఉండటానికి ఐశ్వర్య అంగీకరించింది. 2016 నుంచి నాగ గణేష్ దగ్గర అతని కొడుకు రాజేంద్రన్ ఉంటున్నాడు. కరోనా కారణంగా విడాకుల డీల్ పత్రాలు కోర్టులో సమర్పించడానికి ఆలస్యం అయ్యింది. అలాగే కొడుకు తండ్రి వద్ద ఉండటానికి అంగీకరించింది. అయితే డీల్ లో మాట్లాడుకునట్టుగా .. రూ.65 లక్షలు, జ్యువెలరీ షాప్ ఇవ్వడానికి కొంచెం లేట్ అయింది.

దీనితో ఐశ్వర్య ముగ్గురు కిరాయి హంతకులు, క్రిమినల్స్ తో కలిసి భర్త నాగ గణేష్ దగ్గర పెరుగుతున్న కన్న కొడుకు రాజేంద్రన్ ను కిడ్నాప్ చెయ్యడానికి స్కెచ్ వేసింది. స్కెచ్ ప్రకారం పట్టపగలు కోయంబత్తూరులోని ఎదయర్ పాళ్యంలోని తుడియలూర్ నగర్ లోని భర్త నాగగణేష్ ఇంటి దగ్గరకు ఐశ్వర్య, ముగ్గురు క్రిమినల్స్ కారులో వెళ్లారు. కారులో కుర్చున్న ఐశ్వర్య లోపలికి వెళ్లి తన కొడుకు రాజేంద్రన్ ను కిడ్నాప్ చేసి తీసుకురావాలని క్రిమినల్స్ కు చెప్పింది. ఓ క్రిమినల్ గేట్ బయట కాపాల ఉండగా క్రిమినల్స్ ఇంట్లోకి వెళ్లి నాగ గణేష్ తల్లి మీద దాడి చేసి ఆమె మనుమడు రాజేంద్రన్ ను కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న నాగ గణేష్ కేకలు వేసి కొడుకు రాజేంద్రన్ రక్షించి బెడ్ రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సందర్బంలో చిక్కిపోతామని భయపడిన క్రిమినల్స్ నేరుగా కారు దగ్గరకు పరుగు తీశారు. ఆ సమయంలో నాగ గణేష్ మొబైల్ తీసుకుని ఇంటి బయటకు వచ్చి కారులో కుర్చున్న భార్య ఐశ్వర్య ఫోటోలు తియ్యడానికి ప్రయత్నించాడు. దీనితో పోలీసులు వస్తే కథ పూర్తిగా అడ్డం తిరుగుతుంది అని భావించి ఆ క్రిమినల్స్ తో పాటుగా అక్కడి నుండి పారిపోయింది. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.