Begin typing your search above and press return to search.

తెలంగాణలో నమోదయ్యే కేసుల్లో కనిపించిన కొత్త కోణం

By:  Tupaki Desk   |   20 March 2021 4:41 AM GMT
తెలంగాణలో నమోదయ్యే కేసుల్లో కనిపించిన కొత్త కోణం
X
కరోనా ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద పెద్దగా లేదన్న మాటను గతంలో మాదిరి చెప్పలేని పరిస్థితి. గడిచిన కొద్దిరోజులుగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొన్నటివరకు వంద కంటే తక్కువగా నమోదైన కేసులకు భిన్నంగా.. తాజాగా మూడు వందలకు పైగా కేసులు నమోదు కావటం గమనార్హం. పెరుగుతున్న కేసులు కొత్త ఆందోళనను కలిగిస్తున్నాయి.

తాజాగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది విద్యార్థులు కనిపించటం గమనార్హం. అంతేకాదు.. పాజిటివ్ గా తేలిన వారిలో ఎక్కువ మందికి ఎలాంటి రోగ లక్షణాలు లేకుండా ఉండటం గమనార్హం. ఇటీవల కాలంలో కోవిడ్ పాజిటివ్ గా తేలిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. పరీక్ష చేస్తే మాత్రం పాజిటివ్ గా తేలుతుంది. ఇలాంటి వారు ఇప్పటివరకు దాదాపు 70 శాతం వరకు ఉంటే.. తాజాగా మాత్రం ఇది 90 శాతంగా మారటం కొత్త ఆందోళనకు గురి చేస్తుంది.

ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా.. కరోనా పాజిటివ్ గా ఉండటంతో.. వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చెప్పాలి. ఆరోగ్య వంతులకు ఏమీ కాకున్నా.. వారి ద్వారా వివిధ రోగ లక్షణాలతో బాధ పడే వారిపైన మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీని మూలంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ప్రమాదం భారీగా పొంచి ఉందని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నమోదవుతున్న కేసుల్లో 40 శాతం మంది 12 నుంచి 18 ఏళ్ల లోపు వారే కావటంపైన పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య పెరగటం మంచిది కాదన్న మాట వినిపిస్తోంది. స్కూళ్లు తిరిగి తెరవటం.. స్కూళ్లకు వెళ్లి వస్తున్న కారణంగా.. పిల్లల కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదైంది శుక్రవారం వెల్లడించిన ఫలితాల్లోనే.

గురువారం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పరీక్షల్లో313 మందికి కరోనా పాజిటివ్ అయినట్లుగా లెక్క తేలింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2434 మంది ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్నట్లుగా అధికారికలెక్కలు చెబుతున్నారు. అయితే.. అనధికారికంగా అంతకంటే ఎక్కువే ఉంటారన్న మాట వినిపిస్తోంది.