Begin typing your search above and press return to search.

చిత్తూరులో వివాహిత మృతి..శరీరంలో విష్యం - హత్య? ఆత్మహత్య?

By:  Tupaki Desk   |   23 Oct 2020 12:30 PM GMT
చిత్తూరులో వివాహిత మృతి..శరీరంలో విష్యం - హత్య? ఆత్మహత్య?
X
చిత్తూరు జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. గత కొన్నిరోజులుగా అత్తింటి వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయిన భార్యని బతిమాలి వెనక్కి తీసుకోని వచ్చాడు, అయితే అలా తీసుకువచ్చి సరిగ్గా నెల రోజులు తిరగకముందే ఆమె అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది. అయితే ఆమె శరీరంలో విషం ఆనవాళ్లు ఉండడం కలకలం రేపుతోంది. విషప్రయోగం చేసి చంపేశారా, లేక ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొంగనపల్లెలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. కర్ణాటకలోని కేజీఎఫ్ తాలూకా నెర్ణహళ్లికి చెందిన వీణ కి కొంగనపల్లెకి చెందిన శివతో ఏడాదిన్నర కిందట పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొద్దిరోజులు వారి కాపురం బాగానే సాగిపోయింది. అయితే , ఆ తర్వాత కాపురంలో కలహాలు రేగాయి. ఇంటి స్థలం కొనేందుకు పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటివారి వేధింపులు మొదలైయ్యాయి. భర్త, అతని కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేపోయిన వీణ నాలుగు నెలల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. నెల రోజుల కిందట అత్తింటికి వెళ్లిన శివ.. భార్యను బాగా చూసుకుంటానని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే, అనూహ్యంగా ఆమె తెల్లవారుజామున అపస్మారక స్థితిలో కనిపించింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది.

ఈ విషయం తెలుసుకున్న వీణ కుటుంబ సభ్యులు అల్లుడిపై అనుమానాలు వ్యక్తం చేశారు. భర్త, అతని కుటుంబ సభ్యులే తన కూతురిని హత్య చేశారని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.వీణ అపస్మారక స్థితికి వెళ్లి మృత్యువాతపడడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషప్రయోగం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుప్పం ఏరియా ఆస్పత్రి వైద్యులు చెప్పినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే ఆమెకు విషమిచ్చి హత్య చేశారా లేక ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిందా అనేది పోలీసుల విచారణలో వెల్లడి కానుంది.