Begin typing your search above and press return to search.

ఇంటికోసం గొడవ..ఏపీ ఎంపీ బెదిరింపులు..ఆగిన గుండె!!

By:  Tupaki Desk   |   18 Aug 2020 3:01 PM GMT
ఇంటికోసం గొడవ..ఏపీ ఎంపీ బెదిరింపులు..ఆగిన గుండె!!
X
ఏపీ ఎంపీ బెదిరింపులతో హైదరాబాద్ లోని ఓ వ్యక్తి గుండె ఆగిపోయింది. ఓ స్థలం కోసం మొదలైన ఈ వివాదం చివరికి ఒకరి ప్రాణాలు పోయేలా చేసింది. ఈ విషాదం హైదరాబాద్ లోని ఓల్డ్ బోయినపల్లిలో చోటుచేసుకుంది.

ఓల్డ్ బోయినపల్లిలోని మణికంఠ కాలనీలో మూడేళ్ల క్రితం గణేష్ (28) అనే వ్యక్తి తన కష్టార్జితంతో ఓ స్థలం కొనుకున్నాడు. అక్కడ మంచి ఇల్లు నిర్మించుకొని సొంత ఇంటి కలను నెరవేర్చుకుందామనుకున్నాడు.

కానీ ఆ స్థలం పక్కింటిలో ఉండే రమేశ్ అనే వ్యక్తి కన్ను ఆ స్థలంపై పడింది. గణేష్ ను ఇల్లు కట్టుకోనీయకుండా నరకం చూపించాడు. ఇల్లు కట్టుకున్నా జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో ఇంటిని కూలగొట్టించాడు. గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేసినా సివిల్ కేసు అని పట్టించుకోలేదు.

ఇక గణేష్ పై ఏకంగా రమేశ్ కోర్టుకు ఎక్కాడు. దీంతో చేసేందేం లేక గణేష్ తన స్థలాన్ని రమేశ్ కే విక్రయిస్తానన్నాడు. రూ.20లక్షలు అడ్వాన్సుగా రమేశ్ ఇచ్చాడు. ఆ తర్వాత కొనడం ఇష్టం లేదని వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గణేష్ ఆ డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేశాడు. అయినా రమేశ్ వెనక్కి తగ్గకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎంపీతో బెదిరింపులకు దిగాడు. దీంతో భయాందోళనతో తిండి తినడం మానేసిన గణేష్ ఆదివారం గుండెపోటుతో మరణించాడు.

గణేష్ మృతదేహంతో అతడి బంధువులు రమేశ్ ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రమేశ్, కుటుంబ సభ్యులు పరారయ్యారు. రమేశ్ ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. కాగా ఈ ఇంటి స్థలం విషయంలో ఇద్దరూ గొడవపడి తన వద్దకు వచ్చారని స్థానిక కార్పొరేటర్ నరసింహయాదవ్ తెలిపారు.