Begin typing your search above and press return to search.

సీఎం జ‌గ‌న్‌ కు చ‌క్క‌ని ఛాన్స్‌.. మోడీని మెడ‌లు వంచ‌క్క‌ర్లేదు..!!

By:  Tupaki Desk   |   16 Jun 2022 11:30 AM GMT
సీఎం జ‌గ‌న్‌ కు చ‌క్క‌ని ఛాన్స్‌.. మోడీని మెడ‌లు వంచ‌క్క‌ర్లేదు..!!
X
ఏపీ సీఎం జ‌గ‌న్ ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న చ‌క్క‌ని సువ‌ర్ణావ‌కాశం బంగారు ప‌ళ్లెంలో పెట్టి అందించిన‌ట్టుగా.. ఆయ‌న చెంత‌కే వ‌చ్చింది. జగన్‌ విపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తోనే మనుగడ అని నినదించారు. 2014-19 మధ్య కాలంలో హోదా అంశంపై ఎక్కడలేని దూకుడు ప్రద ర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో 25 మంది వైసీపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే... కేంద్రం మెడలు వంచుతానన్నా రు. కేంద్రంపై పోరాడాలని ప్రజలను, యువకులను కోరారు.

ఇక‌, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై సంతకం పెట్టా కే మద్దతిస్తామని పదేపదే స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2019లో జరిగిన ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి, ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రత్యేక హోదాపై జగన్ మౌనం పాటించారు. అదేమంటే.. 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి 250 కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయని, వారికి మన అవసరం లేదు కాబట్టి హోదా కోసం ఒత్తిడి తేలేమన్నారు.

ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో ఒక తీర్మానం మాత్రం చేసి, కేంద్రానికి పంపి.. చేతులు దు లుపుకొన్నారు. అయితే.. ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వైసీపీకి అద్భుతమైన అవకాశం వచ్చింది. రాష్ట్రపతి ఎన్నిక కేంద్రంలోని బీజేపీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. మెజార్టీ విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక నువ్వా.... నేనా? అన్నట్టు జరిగేలా కనిపిస్తోంది. ఈ దశలో బీజేపీకి వైసీపీ మద్దతు అత్యంత కీలకంగా మారింది. లోక్‌సభలో బలాబలాల పరంగా 22 మంది ఎంపీలతో నాలుగో పెద్ద పక్షంగా వైసీపీ ఉంది. రాజ్యసభలో 9 మంది ఎంపీలున్నారు. అసెంబ్లీలోనూ ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తంగా వైసీపీకి రాష్ట్రపతి ఎన్నికల్లో 45,525 ఓట్లు ఉన్నాయి.

ప్రతి ఓటూ కీలకమైన ఈ తరుణంలో... బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఎన్నిక సాఫీగా జరగాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. వైసీపీ ఇప్పుడు ఏం కోరినా కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఈ సువర్ణావకాశాన్ని వైసీపీ వినియోగించుకోవాలని, హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని షరతు పెట్టాలన్న డిమాండ్‌ వివిధ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.