Begin typing your search above and press return to search.

తెలంగాణ : రైతు ప్రాణం తీసిన ఇసుక మాఫియా !

By:  Tupaki Desk   |   30 July 2020 10:30 AM GMT
తెలంగాణ : రైతు ప్రాణం తీసిన ఇసుక మాఫియా !
X
మహబూబ్‌ నగర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. తమ పొలాల నుంచి ఇసుక లారీలను తీసుకెళ్లొద్దు.. పొలాలు నాశనమై పోతున్నాయని ఎదిరించిన పాపానికి ఓ రైతుని నిర్దాక్షిణ్యంగా లారీ తో తొక్కించి కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తీర్మాలపూర్‌ లో జరిగింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. రాజాపూర్ మండలం తీర్మాలపూర్‌ గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో నుంచి ఇసుక అక్రమ రవాణా చేసేందుకు కొందరు వ్యక్తులు మంగళవారం రాత్రి ప్రయత్నాలు చేసారు అయితే , ఆ విషయం తెలుసుకున్న ఆ గ్రామానికి చెందిన గుర్రం కాడి నరసింహులు అనే రైతు వారిని యత్నించాడు. తన వ్యవసాయ పొలం నుంచి ఇసుక అక్రమ రవాణా చేయవద్దు అని, దీనివల్ల మూడు సంవత్సరాలుగా బోర్లన్నీ ఎండిపోతున్నాయని తన ఆవేదనను వారి వద్ద విన్నపించుకొని, లారీలను పొలంలో నుండి వెళ్లనిచ్చేది లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేసాడు. దానితో కిరాతకులు ఆ రైతుపై లారీని ఎక్కించి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో నరసింహులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని లారీ అద్దాలు ధ్వంసం చేశారు. అలాగే ఇసుక రవాణా వద్దని వారించిన రైతులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇసుక మాఫియా తమ ఆగడాలు కొనసాగుతున్నాయని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇసుక మాఫియా మూలంగా రోడ్డు ప్రమాదంలో అమాయక రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి అని తెలిపారు. ఎన్ని కంప్లంట్స్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.