Begin typing your search above and press return to search.

ఢిల్లీ స్కూల్ లో దారుణం..9వ త‌ర‌గ‌తి విద్యార్థి హ‌త్య?

By:  Tupaki Desk   |   2 Feb 2018 4:24 PM GMT
ఢిల్లీ స్కూల్ లో దారుణం..9వ త‌ర‌గ‌తి విద్యార్థి హ‌త్య?
X
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌ లో రెండో తరగతి విద్యార్థి ప్రద్యుమ్న్ ఠాకూర్ (7) హ‌త్యోదంతం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగతి తెలిసిందే. మొద‌ట బ‌స్సు డ్రైవ‌ర్ ఆ ఘాతుకానికి పాల్ప‌డ్డాడ‌ని అంద‌రూ అనుమానించారు. కానీ, ప‌రీక్ష‌లు వాయిదా వేయ‌డం కోసం ....ఆ స్కూల్ లో చ‌దివే 9వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆ దారుణానికి ఒడిగ‌ట్టాడ‌ని పోలీసులు విచార‌ణ‌లో తేలింది. ప‌సిపిల్ల‌ల్లో ఈ త‌ర‌హా స్వ‌భావాన్ని చూసిన త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆ దారుణ‌ ఘటనను మరవక ముందే ఢిల్లీలోని మ‌రో స్కూల్ లో అదే త‌ర‌హాలో మ‌రో ఘోరం జ‌రిగింది. కరవాల్ నగర్ లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చ‌దువుతున్న తుషార్ కుమార్ బాత్ రూమ్ లో శ‌మ‌మై క‌నిపించ‌డం దేశ‌రాజ‌ధానిలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

ఆ పాఠ‌శాల‌లో 9వ త‌ర‌గ‌తి చ‌దువుతోన్న తుషార్....బాత్రూమ్ లో విగ‌త జీవిగా ప‌డి ఉండడాన్ని గ‌మ‌నించిన పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచార‌మిచ్చింది. ఆ పాఠ‌శాల‌లోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు షాక్ కు గుర‌య్యారు. తుషార్ కుమార్‌ - మరో ముగ్గురు విద్యార్థులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, తుషార్ ను ఆ ముగ్గురు విద్యార్థులు చితక‌బాదిన త‌ర్వాత టాయిలెట్ వద్ద పడేసినట్లు సీసీటీవీ ఫుటేజిలో క‌నిపించింది. అయితే, ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం వాద‌న మ‌రోలా ఉండ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. తుషార్ అనారోగ్యం వల్లే మృతి చెందాడని పాఠ‌శాల యాజ‌మాన్యం చెబుతోంది. అయితే, వారి వాద‌న‌ను తుషార్ త‌ల్లిదండ్రులు ఖండించారు. తమ కుమారుడు ఆరోగ్యంవంతంగా ఉన్నాడ‌ని, త‌మ బిడ్డ‌ది ముమ్మాటికీ హత్యేనని వారు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత గానీ తుషార్ మృతికి గల అస‌లు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తుషార్ స్నేహితులను - ఉపాధ్యాయుల‌ను - సిబ్బందిని విచార‌ణ చేస్తున్నారు.