Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే పదవి కోసం రూ.11.50 కోట్లు ఎలా?

By:  Tupaki Desk   |   8 March 2017 5:22 AM GMT
ఎమ్మెల్యే పదవి కోసం రూ.11.50 కోట్లు ఎలా?
X
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు...త‌న ఎన్నిక గురించి టీవీలో ఆయ‌న నోరు జారిన ప‌రిణామం ఇప్ప‌టికే ప్ర‌త్యర్థుల‌కు అస్త్రంగా మార‌గా...తాజాగా తెలంగాణ‌లో కేసు న‌మోదైంది. కోడెల శివప్రసాద్‌ రావు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కరీంనగర్‌ స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో కేసు నమోదైంది. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లికి చెందిన సింగిరెడ్డి భాస్కర్‌ రెడ్డి 2016 జూలై 11న కరీంనగర్‌ స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోడెల‌కు ఆదేశాలు అయ్యాయి.

ఫిర్యాదులోని వివరాలు ఇవి.... భాస్కర్‌ రెడ్డి 2016 జూన్‌ 19న ఒక టీవీ ఛానల్‌ చూస్తుండగా కోడెల శివప్రసాద్‌ రావుకు సంబంధించిన ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఇందులో ఎన్నికలకు సంబంధించిన విషయాలపై చర్చలో కోడెల శివప్రసాద్‌ మాట్లాడుతూ...'నేను మొదటిసారి 1983 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రూ.30వేలు మాత్రమే ఖర్చయ్యాయి. అవికూడా ప్రజల నుంచి వచ్చిన చందాలు' అని చెప్పుకొచ్చారు. అలాంటిది మొన్నటి చివరి ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు అయినవి తెలిపారు. దీనిని టీవీలో విన్న భాస్కర్‌ రెడ్డి.. ఎమ్మెల్యే పదవి కోసం రూ.11.50 కోట్లు ఎలా ఖర్చు చేశారని, ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిన ఖర్చు కంటే 40 రెట్లు ఎక్కువగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం కమిషన్‌ పేర్కొన్న ఎన్నికల వ్యయం చూపించాల్సి ఉంటుందని తెలిపారు. అలాంటిది అధిక మొత్తంలో ఖర్చు చేయడమంటే ఓటర్లను, అధికారులను మభ్యపెట్టారా అనే అంశాన్ని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును త్రీటౌన్‌ లో ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని, అందుకే న్యాయస్థానంలో దాఖలు చేశామన్నారు. న్యాయస్థానంలో కేసు విచారణ సందర్భంగా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై భాస్కర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఫిర్యాదు వివరాలను పరిశీలించిన హైకోర్టు కేసు విచారణకు స్వీకరించాలని చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు ఆదేశాలు జారీచేసింది. దీనిపై చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ సీసీనంబరు 1/2017గా కేసు నమోదు చేసి ఎన్నికల వివాదాల గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరీంనగర్‌ స్పెషల్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ (మొబైల్‌ కోర్టుకు) బదిలీ చేసింది. విచారణకు హాజరు కావాలని కోడెలకు సమన్లు జారీ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/